బీఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ సెంటిమెంట్’తో రాజకీయాలు చేస్తూ పైచేయి సాధించాలని ప్రయత్నిస్తుంటే, సిఎం రేవంత్ రెడ్డి దానిపై ఓ బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. అదే బీసీ రిజర్వేషన్స్!
బీసీలకు విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్టీ లైట్ తీసుకుంది. రాజ్యాంగ సవరణ చేసి ఆమోదముద్ర వేస్తే తప్ప దానిని రేవంత్ రెడ్డి అమలు చేయలేరు కనుక తాము కూడా బీసీల సంక్షేమం కోరుకుంటున్నామని చెప్పుకోవచ్చని ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఆ తీర్మానానికి మద్దతు పలికింది.
కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని తమ వేళ్ళతో తమ కళ్ళు పొడుచుకునేలా చేశారని చెప్పవచ్చు. దీనినే ఆయన తమపై బ్రహ్మాస్త్రంగా ప్రయోగించబోతున్నారని బహుశః ఈపాటికి బీఆర్ఎస్ పార్టీకిఅర్ధమయ్యే ఉంటుంది.
నిన్న ధిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశమై బీసీ రిజర్వేషన్స్ బిల్లుతో ఏవిదంగా రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చో వివరించారు.
వారు చెప్పింది విన్నాక రాహుల్ గాంధీ “రాజ్యాంగంలో 50 శాతం రిజర్వేషన్స్ పరిమితి’ని బద్దలు గొట్టి బీసీలకు రిజర్వేషన్స్ కల్పిద్దామని చెప్పారు.
దీని కోసం ఈ పార్లమెంట్ సమావేశాలలోనే ఇండియా కూటమి ఎంపీలందరూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేయిద్దామని చెప్పారు.
ఒకవేళ బీసీ రిజర్వేషన్స్ తీర్మానాన్ని కాంగ్రెస్ అధిష్టానం కూడా పట్టించుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ సెంటిమెంట్’ అస్త్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ఆటాడుకునేది.
కానీ రాహుల్ గాంధీ దీని కోసం పార్లమెంటులో పోరాడటానికి సిద్దపడటంతో సిఎం రేవంత్ రెడ్డి ‘బీసీ రిజర్వేషన్స్ హీరో’గా గుర్తింపు పొందబోతున్నారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు.
దీనిని మోడీ ప్రభుత్వం ఆమోదించినా, తిరస్కరించినా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి లాభమే తప్ప నష్టపోవు. ఆమోదిస్తే దేశమంతా బీసీ రిజర్వేషన్స్ అమలుచేయాల్సి ఉంటుంది.
లేకుంటే దీని కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో కూడా పోరాడిందని, కానీ ప్రధాని మోడీ ఆ కుర్చీలో ఉన్నంత వరకు బీసీలకు రిజర్వేషన్స్ పెరగవు కనుక వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే చట్ట సవరణ చేసి అమలుచేస్తామని చెప్పుకొని బీసీలను ఆకట్టుకొని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు.
ముఖ్యంగా తెలంగాణలో ఇది బీఆర్ఎస్ పార్టీపై బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే, లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేంద్రంలోకి అధికారంలోకి రాగలదు. బీసీ రిజర్వేషన్స్ అమలుచేయగలదు.
కానీ తెలంగాణకు మాత్రమే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీని శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో గెలిపించినా అది బీసీలకు రిజర్వేషన్స్ పెంచలేదు! కనుక బీసీ రిజర్వేషన్స్ అస్త్రం ముందు తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం పనిచేయకపోవచ్చు.
ఈ బీసీ రిజర్వేషన్స్ అస్త్రం పనిచేస్తోందో లేదో త్వరలో జరుగబోయే బీహార్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరీక్షించుకోబోతోంది. ఒకవేళ ఈ అస్త్రంతో కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికలలో గెలిస్తే ఇక అన్ని రాష్ట్రాలలో ఇదే అస్త్రం లేదా ఇలాంటి అస్త్రాలే ప్రయోగించడం తధ్యం.
ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి సరైనోడు అని చెప్పక తప్పదు.






