డిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో పాల్గొన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపితో సహా ప్రాంతీయ పార్టీలన్నీ సాతంత్ర్యం తర్వాత పుట్టినవే అని అన్నారు. ఈ పార్టీలన్నీ ఎన్నికలలో గెలిస్తే కుర్చీలలో లేకుంటే ఇంట్లో కూర్చుంటాయన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలుపోటములతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటుందన్నారు.
ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచిస్తుందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపికి 150కి మించి లోక్ సభ సీట్లు రాకుండా చేసి ప్రతిపక్షంలో కూర్చోబెడతామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పార్టీల సీనియారిటీని ప్రజలు పట్టించుకోరని వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమితోనే రుజువైంది. తెలంగాణ ఇచ్చినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పదేళ్ళపాటు అధికారం ఈయలేదు. ప్రజలు తమ సమస్యల పరిష్కరించే పార్టీ, రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ది చేసే పార్టీలకే మొగ్గు చూపుతారని నిరూపితమైంది.
కానీ గత మూడు ఎన్నికల ఫలితాలను చూస్తే ప్రతీ ఎన్నికలలో బీజేపి నేతృత్వంలో ఎన్డీయే కూటమికి లోక్ సభలో బలం తగ్గుతుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యతో సతమతమవుతున్నప్పటికీ దాని నేతృత్వంలోని ఇండియా కూటమి క్రమంగా పుంజుకొని బలపడింది.
కనుక 15 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వాన్ని చూస్తున్న ప్రజలు ఒకవేళ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీని వద్దనుకోవచ్చునేమో కానీ ఇండియా కూటమిలో ఆయనకు బలమైన ప్రత్యామ్నాయం ఎవరూ కనిపించడం లేదు. కనుక దేశ ప్రజలు ఒకవేళ మోడీని వద్దనుకున్నా కాంగ్రెస్ బలహీనంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకే పట్టం గట్టడం ఖాయం.
కానీ ఎన్నికలలో కాంగ్రెస్ లేదా బీజేపి గెలవాలంటే ఆ సమయంలో రాజకీయ పరిస్థితి అనుకూలించాలి. కూటమిలో పార్టీల మద్య పరస్పర నమ్మకం, సహకారం ఉండాలి. అవి చెప్పే మాటలను ప్రజలు నమ్మాలి.
కనుక అంతకంతకూ బలపడుతున్న బీజేపిని లోక్ సభ ఎన్నికలలో 150 సీట్లకు కట్టడి చేయడం అంత సులువేమీ కాదు. ఇదివరకు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఇలాగే పగటి కలలు కన్నారు. కానీ చివరికి ఏం జరిగిందో అందరూ చూశారు కదా?
వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించి 100కి పైగా సీట్లు గెలుచుకొని తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా చెపుతోంది. కనుక సిఎం రేవంత్ రెడ్డి కూడా జాతీయ రాజకీయాలను కాంగ్రెస్ అధిష్టానానికి విడిచిపెట్టి తెలంగాణకే పరిమితమైయితేనే చాలా మంచిది. లేకుంటే చరిత్ర పునరావృతం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.






