కొండా సురేఖ బర్తరఫ్ సీఎం రేవంత్ కి అత్యంత కీలక రాజకీయ పరిణామంగా మారబోతుంది. బీసీ కార్డు కి తోడు మహిళా కార్డు కూడా సురేఖ కు అదనపు అస్త్రం కానుంది. ఇప్పటి వరకు రేవంత్ టార్గెట్ గా బహిరంగ విమర్శలు చేయని సురేఖ ఇక ఇప్పుడు ఆ సాహసానికి వెనుకాడేలా కనిపించడం లేదు.
అందులో భాగంగానే నేడు తన మంత్రి పదవి పోవడానికి సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయమే కారణమంటూ, రేవంత్ రెడ్డి టీడీపీ డీఎన్ఏ ఉన్న నాయకుడంటూ కొత్త రాగం అందుకున్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే తరహా రాజకీయం చేసేవారని,
ఇప్పుడు రేవంత్ కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారంటూ రేవంత్ ని ఇప్పటికి టీడీపీ నాయకుడిగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం నేతలు రేవంత్ టార్గెట్ గా పరోక్ష విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో వలస నేతల అధికార పెత్తనం ఎక్కువయ్యిందంటూ కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలుమార్లు రేవంత్ ని టీడీపీ నేతగానే ప్రచారం చేస్తున్నారు.
ఇక ఇప్పుడు రాజగోపాల్ స్వరానికి కొండా సురేఖ గొంతు కలిపితే కాంగ్రెస్ లో రేవంత్ పై అంతర్గత యుద్ధం సిద్దమయినట్టే. తనను మంత్రి పదవి నుంచి తొలగించినా తానూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గానే కొనసాగుతానని సురేఖ తేల్చి చెప్పడంతో రేవంత్ కి సొంత పార్టీలోనే అసమ్మతి సెగ మొదలయినట్టే భావించాలి.
సురేఖ మంత్రి పదవి తొలగింపు, చిన్నా రెడ్డి పార్టీ పదవుల నుంచి తొలగించడం రేవంత్ కి ఒకరకమైన అసమ్మతిని సృష్టిస్తే, ఇప్పుడు సురేఖ మంత్రి పదవి పై ఆశలు పెట్టుకునే నేతలు వారికి వారు కోరుకున్న మంత్రి పదవి దక్కకపోతే అందుకు సీఎం రేవంత్ నే భాద్యుడిని చేస్తారు.
అధిష్టానానిదే తుది నిర్ణయం అంటూ చిలకపలుకులు పలికే ఈ సోకాల్డ్ నేతలు మంత్రి పదవి తమకు దక్కితే ఆ క్రెడిట్ అధిష్టానం ఖాతాలో వేస్తారు, తమకు దక్కపోతే ఆ నిందారోపణలు సీఎం రేవంత్ పై నెడతారు. దీనితో ఇక కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ అంతర్గత యుద్ధం చేయాల్సిందే అనేది స్పష్టమయింది.
కొండా సురేఖ నుంచి మొదలుపెడితే కోమటిరెడ్డి రాజగోపాల్, చిన్నా రెడ్డి…ఇలా రేవంత్ పై కత్తులు దూసేందుకు సొంత పార్టీ నేతలు ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. కాబట్టి రేవంత్ కి రానున్న కాలం అటు ప్రత్యర్థి పార్టీల రాజకీయాన్ని ఎదిరించాలి, సొంత పార్టీ చేస్తున్న అంతర్గత యుద్దాన్ని జయించాలి. ఇలా రెండు వైపులా పదునున్న కత్తితో రాజకీయ యుద్ధం చెయ్యాలి, ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కోవాలి.





