అధికార పార్టీలో మంత్రి గా ఉంటూ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ముఖ్య నేతలలో మాజీ బిఆర్ఎస్ మంత్రి ఈటెల రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి టి. రాజయ్య ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో బిఆర్ఎస్ అధికారం చేపట్టిన పిదప కేసీఆర్ క్యాబినెట్ లో తొలి వైద్యారోగ్య శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఎంపికైన టి. రాజయ్య ను నాటి సీఎం కేసీఆర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసారు.
వైద్యారోగ్య శాఖలో వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ టి. రాజయ్యను 2015 జనవరి 25 న తన కేబినెట్ నుంచి తొలగించారు. ఆయన స్థానంలో సీనియర్ రాజకీయ నాయకుడైన కడియం శ్రీహరికి ఆ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు.
అలాగే ఇక బిఆర్ఎస్ రెండవసారి అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఈటల రాజేంద్రప్రసాద్ ను సైతం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆక్రమల ఆరోపణలతో తన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసారు.
మెదక్ జిల్లా ముసాయిపేట మండలం అచ్చంపేట, హాకిం పేట ప్రాంతాలలో అసైన్డ్ భూముల ఆక్రమణలకు సంబందించిన ఆరోపణలతో సీఎం కేసీఆర్ ఈటల నుంచి ఆరోగ్యశాఖను తనవద్దకు తీసుకుని 2021 మే 2 న ఆయనను తన క్యాబినెట్ నుంచి తొలగించారు. అలాగే ఈటల స్థానంలో హరీష్ రావు ను రీ ప్లేస్ చేసారు కేసీఆర్.
సరిగ్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన మూడో ప్రభుత్వం కూడా తన క్యాబినెట్ నుంచి ఒక మంత్రిని బర్తరఫ్ చేసింది. రేవంత్ సర్కార్ ఏర్పడి 1000 రోజులు గడుస్తున్న ఈ తరుణంలో కొండా సురేఖ వివాదం కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద రాజకీయ కుదుపుగా మారబోతుందా అన్న చర్చ మొదలయ్యింది.
కొండా సురేఖ కుమార్తె సుస్మిత రేవంత్ టార్గెట్ గా చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మంత్రిగా ఉన్న కొండా సురేఖ స్పందన సరిగ్గా లేదనే కారణంతో కొండా సురేఖను రేవంత్ క్యాబినెట్ నుంచి నేడు అధిష్టానం బర్తరఫ్ చేసింది. 2023 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ అనుకోని వివాదాలలో ఇరుక్కుంటూ చివరికి తన మంత్రి పదవిని పోగొట్టుకున్నారు.
ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొలువుతీరిన మూడు ప్రభుత్వాలలోను టి. రాజయ్య, ఈటల రాజేంద్రప్రసాద్, కొండా సురేఖ ఇలా ముగ్గురు మంత్రులు తమ మంత్రి పదవి నుంచి తొలగించబడ్డారు. అయితే ఇందులో బిఆర్ఎస్ ప్రభుత్వంలో తొలగించబడ్డ ఇద్దరు మంత్రులు విద్యాశాఖ మంత్రులు కాగా కాంగ్రెస్ లో దేవాదాయశాఖ మంత్రి కావడం విశేషం.





