ఏపీలో జగన్ అధికారంలోకి వస్తూనే రివర్స్ గేర్ వేసి అమరావతి, పోలవరం నిలిపివేసి, ప్రజావేదిక కూల్చేసి కనిపించని మూడు రాజధానులతో దిగ్విజయంగా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించారు.
ఒక్క భారీ ఛాన్స్ లభిస్తే సద్వినియోగం చేసుకోలేక ఓటమి అంచున నిలబడి ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నప్పుడు, మరే ముఖ్యమంత్రి మళ్ళీ అలాంటి తప్పులు చేస్తారని ఎవరూ అనుకోరు.
కానీ బొటాబోటి మెజార్టీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా రివర్స్ గేర్ వేసి ముందుకు సాగే ప్రయత్నం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
తెలంగాణలో ‘కేసీఆర్ని కొట్టే మొగాడే పుట్టలేదు’ అని ప్రగల్భాలు పలికిన బిఆర్ఎస్ నేతలకు, రేవంత్ రెడ్డి రూపంలో ఆ మగాడు కనిపించాడు. కానీ ఈ 5-6 నెలల రేవంత్ పాలన చూస్తుంటే, కేసీఆర్ని ఓడగొట్టడం వరకే ఆయన హీరోయిజం పరిమితమా?పాలనలో కాదా?అనే సందేహం కలుగుక మానదు.
లోక్సభ ఎన్నికలు కూడా అయిపోయాయి కనుక ఇక పూర్తి సమయం పాలనపై దృష్టి పెడతానని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు.
కానీ తెలంగాణలో ఓ పక్క రైతులు కరెంట్, నీళ్ళు, విత్తనాలు, ఎరువుల కోసం, పండించిన ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూస్తుంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ నిర్ణయాలను మార్చే పనితో కాలక్షేపం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఇంకా అమలులో ఉన్నందున పూర్తి స్థాయిలో పాలన చేయలేకపోతున్నామని సర్ధి చెప్పుకుంటున్నప్పటికీ, కరెంటు, నీళ్ళ కష్టాలు తీర్చేందుకు ఏ కోడ్ అడ్డు చెప్పదు కదా?
ఏపీ, తెలంగాణలు విడిపోయినప్పుడు మీ ‘తెలుగు తల్లి’మీకు మాత్రమే తల్లి… మాకు కాదంటూ కేసీఆర్ ‘తెలంగాణ తల్లి’ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ తెలంగాణ తల్లి… మా తల్లి కాదంటూ మరో తల్లిని ఏర్పాటు చేయిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో ఛార్మినార్, కాకతీయ తోరణం తొలగించాలని నిర్ణయించడంతో దాంతో మరో వివాదం నడుస్తోంది.
కవి అందెశ్రీ వ్రాసిన ‘జయజయహే…’ తెలంగాణ గీతాన్ని కీరవాణి చేత స్వరపరచడంతో మళ్ళీ ఆంధ్రా-తెలంగాణ వివాదం మొదలైంది.
చంద్రబాబు మీద ద్వేషంతో జగన్ ప్రజావేదికని కూల్చేసినపుడు, అమరావతిని పాడుపెట్టాలని నిర్ణయించినప్పుడు రాష్ట్ర ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇదే విదంగా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మీద ద్వేషంతో మొదలుపెట్టిన్న ఈ మార్పులు చేర్పులతో ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించిన్నట్లు లేదు.
ఆంధ్రా ప్రజల ఆకాంక్షలు అర్దం చేసుకోకపోవడం వలననే నేడు ఎన్నికలలో ఓడిపోయే పరిస్థితి కొని తెచ్చుకున్నారు. ఇది చూస్తూ కూడా రేవంత్ రెడ్డి ఈవిదంగా అవసరం లేని పనులు చేస్తూ చేజేతులా వివాదాలు ఎందుకు సృష్టించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ముందుగా కేసీఆర్లాగ పాలనలో తనదైన ముద్రవేసి ప్రజల కష్టాలను సమస్యలను తీర్చి వారి ప్రేమాభిమానాలు సంపాదించుకున్న తర్వాత, ఇలాంటి ఎన్ని మార్పులు చేసినా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ముందుగా చేయాల్సిన పనులను పక్కన పెట్టి అవసరం లేని పనులతో కాలక్షేపం చేస్తున్నారు.
ఆంధ్రాని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడుని కాదని తనను ఎందుకు గెలిపించారో జగన్మోహన్ రెడ్డి అర్దం చేసుకోకుండా ముందుకు సాగి నష్టపోబోతున్నారు. అలాగే తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్ని కాదని ప్రజలు తనకు ఎందుకు అవకాశం ఇచ్చారని రేవంత్ రెడ్డి కూడా గ్రహించకుండా ఇలాగే ముందుకు సాగితే, చివరికి జగన్లాగే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
ఈ విషయం గ్రహించేసరికి జగన్ పుణ్యకాలం పూర్తయిపోయింది. కానీ రేవంత్ రెడ్డికి ఇంకా నాలుగున్నరేళ్ళు సమయం ఉంది. కనుక ఇప్పటికైనా సరైన మార్గంలో ముందుకు సాగడం చాలా మంచిది.




