ఒక నాయకుడి నిజమైన పాలనా విధానాలు రాష్ట్రం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడే భయటపడుతుంది, అలాగే అటువంటి సమయంలో ఆయన తీసుకునే నిర్ణయాలే ఆ నాయకుడిని ప్రజా నాయకుడిని నిలబెట్టగలుగుతాయి.
ఇప్పుడు అటువంటి సమయం, సందర్భం రెండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కి వచ్చింది. ప్రభుత్వం పరంగా ఎటువంటి పాలనా అనుభవం లేకుండానే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి, అందునా సీనియర్లలో కిక్కిరిసిన కాంగ్రెస్ పార్టీలో కావడం, ఇక దానికి తోడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే రేవంత్ చిన్న వయస్సు కావడం అది ఆయన అదృష్టమనే చెప్పాలి.
అయితే ఇప్పుడు ఆ అదృష్టమే ఆయన ముందట వరదల రూపంలో సంక్షోభం మాదిరి నిలబడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక జిల్లాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల పంట జలసమాధి అయ్యింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతంలోని ప్రజలు కరెంట్ లేక, తాగేందుకు మంచి నీరు దొరకక, తినేందుకు ఆహారం లభించక, ప్రభుత్వ సాయం కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ధీనంగా ఎదురు చూస్తున్నారు.
నేషనల్ హైవే రోడ్ల పై సైతం వరద నీరు కాలువల మాదిరి ప్రవహిస్తున్నాయి. రోడ్ల మీద ఉన్న అనేక వాహనాలు ఆ వరద నీటికి కొట్టుకుపోతున్న దృశ్యాలు మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి.
ఒక పక్క పండించిన పంటలు వరద నీటితో నాశనం అవుతున్నాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు, మరో పక్క ఈ వరదలు తేరుకోలేని ఆర్ధిక భారమవుతుందంటూ అనేక చిన్న, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ బాధిత కుటుంబాలందరు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించే వరద సాయం కోసం ఆశగా ఎదురు చూస్తారు. వారి కష్టాన్ని, వారి బాధను తగ్గించేలా రేవంత్ సర్కార్ వరద సాయం ప్రకటించగలిగితే అది బాధితులకు కొంత మేరకు ఉపశమనం కలిగించవచ్చు.
అయితే రేవంత్ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణలో ఇంతటి స్థాయి వరదలు రెండో సారి తెలంగాణను చుట్టిముట్టాయి. ఇప్పుడు ఆ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అధికారులను అప్రమత్తం చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే వసతులు రేవంత్ నాయకత్వాన్ని బయటకు తెస్తాయి.
గత ఏడాది బుడమేరుతో మునిగిన విజయవాడ వాసులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి బాబు సమస్య పరిష్కారం కోసం, బాధితులకు అండగా ఉండేందు గాను ఆ బాధిత ప్రాంతంలోనే బస ఏర్పాటు చేసుకుని నేనున్నాను భయపడకండి అంటూ బాధిత ప్రజలకు భరోసా అందించారు.
ఏడు పదుల వయస్సులోనూ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి అధికారులు, వాలంటీర్లు, ప్రభుత్వం అందించే తక్షణ సాయాలు అందుతున్నాయా.? లేదా అంటూ బాధితుల నుండి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలు ఇచ్చే సూచనలను స్వీకరించి ఆ దిశగా మంత్రులకు, అధికారులకు ఆదేశాలిచ్చారు.
దానికి తోడు పూర్తిగా వరద నీరు తొలగిపోయి బాధితులు పునరావాస స్థావరాల నుంచి వారి స్వగృహాలకు వెళ్లిన తరువాత బురద తో నిండి పోయిన వారి ఇంటిని, ఆ పరిసరాలను ఫైర్ ఇంజన్ల సాయంతో ప్రభుత్వమే ఉచితంగా శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవడం తో పాటు బాధిత కుటుంబాలకు కొంత మేర ఆర్థిక సాయం ప్రకటించి ఊరట నిచ్చారు.
ఇక వరదల కారణంగా పాడైపోయిన గృహ ఎలక్ట్రానిక్స్ నుంచి కార్లు, బైకులు, ఆటోవాలాలకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఉచిత సేవలు అందించేలా ఆయా కంపనీలకు ఆదేశాలిచ్చారు. గతంలో విశాఖ హుధుద్ తుఫాన్ సంక్షోభం సమయంలోను సీఎం గా బాబు తీసుకున్న చర్యలు, పాటించిన విధానాలు విశాఖ ప్రజల మనసు గెలిచాయి.
ఆ కృతజ్ఞతే 2019 వైసీపీ ప్రభంజనంలో కూడా విశాఖ వాసులు టీడీపీ వైపే నిలబడేలా చేసింది. జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించిన వైసీపీ ని కాదని 2024 లో టీడీపీ పట్టం కట్టాయి. ఇలా బాబు సంక్షోభంలోనూ తన సమయ స్ఫూర్తి ప్రదర్శించి అప్పుడు,ఇప్పుడు, ఎప్పుడు ప్రజా నాయకుడుగానే పేరు సంపాదించుకున్నారు.
మరి ఆయన దగ్గర రాజకీయ ఓనమాలు దిద్దుకున్న రేవంత్ కూడా ఇటువంటి విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజా నాయకుడిగా గుర్తింపు సంపాదించుకుంటారా.? లేక జగన్ మాదిరి తన అనుభవరాహిత్యాన్ని భయటపెట్టుకుంటారా.? అయితే ఇప్పటికే విపక్ష బిఆర్ఎస్ నాయకులు వరద సాయం విషయంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయ్యింది అంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.






