కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించని విజయాన్ని, కాంగ్రెస్ నాయకులు కూడా నమ్మలేని సత్యాన్ని ఆవిష్కరించి ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
స్వపక్షంలోనే విపక్షముగా ఉండే ఎందరో సీనియర్ కాంగ్రెస్ నాయకులను దాటుకుని, ఢిల్లీ స్థాయిలో ఉన్న పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుని తనను అవమానించిన వారి ముందే తలెత్తుకునేలా చేసుకుని అతి చిన్న వయస్సులోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్న అరుదైన నేతగా రేవంత్ చరిత్ర సృష్టించాడనే చెప్పాలి.
అయితే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్న రేవంత్ రాజకీయం ఒక వైకుంఠపాళి ఆట మాదిరి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తి కాబోతున్న వేళ రేవంత్ సాధించింది ఏమిటి అని ఒక్కసారి పరిశీలిస్తే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోనే ఇది దొరల ప్రభుత్వం కాదు ప్రజా ప్రభుత్వం అంటూ ప్రగతి భవన్ కు గత పాలకులు వేసిన ఇనుపకంచెలు తొలగించి దాన్ని ప్రజా భవన్ గా మార్చి ప్రజాదర్బార్ నిర్వహించారు.
దీనితో రేవంత్ రాజకీయంగా ప్రజల దృష్టిలో ఒక పెద్ద నిచ్చెన ఎక్కారు. ఇక ఆతరువాత నాలుగు నెలల పాటు పార్టీ అసమ్మతులను సంతృప్తి పరచడం, ప్రత్యర్థి పార్టీ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడంతో సరిపెట్టి గత పాలకుల మాదిరే వలస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు అనే అపవాదు మూటకట్టుకుని మళ్ళీ కింద పడ్డారు.
ఇక ఆ తరువాత హైద్రాబాద్ కు పునర్జీవనం, మూసీ సుందరీకరణ అంటూ హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుగా సెలబ్రేటిస్ తో ఈ కార్యక్రమం మొదలుపెట్టి నాగార్జున N కన్వెన్షన్ ను కూల్చివేశారు. అయితే ఈ కార్యక్రమానికి మొదట్లో మంచి స్పందనే వచ్చి రేవంత్ నిర్ణయానికి మద్దతు దక్కి మరోమారు పైకెక్కారు.
అయితే పోను పోను హైడ్రా పేద, సామాన్య మధ్యతరగతి ప్రజలలో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుని ప్రతిపక్షానికి ఒక అస్త్రంగా మారింది. దీనితో మరికొన్నాళ్లు హైడ్రా కు బ్రేకులు వేయక తప్పలేదు. ఇక గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వహించిన నిర్లక్ష్యం తో విసిగిపోయిన గ్రూప్ 2 విద్యార్థులు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని తప్పుబడుతూ రోడ్డెక్కి నిరసన కార్యక్రమానికి దిగారు.
వారి పై పోలీసులు అనుసరించిన తీరు కూడా రేవంత్ సర్కార్ కు వ్యతిరేకతను తీసుకువచ్చింది. అలాగే ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తి అయినా హైద్రాబాద్ బ్రాండ్ వాల్యూ ని మరో స్థాయికి తీసుకువెళ్లే కంపెనీలను రాష్ట్రానికి రేవంత్ సర్కార్ తీసుకురాలేకపోయింది అనే వాదన కూడా హైద్రాబాద్ యువతలో కనిపిస్తుంది.
అలాగే గత పదేళ్ల బిఆర్ఎస్ దోపిడీని బయట పెట్టి వారు అనుసరించిన అనాలోచిత నిర్ణయాల పై విచారణ చేపట్టి వారి పై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం అంటూ చెప్పుకొచ్చిన రేవంత్ ప్రకటనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీనికి తోడు కొంతమంది మంత్రులు చేసిన అసభ్యకర ప్రకటనలకు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ ఖండించక పోవడం కూడా రేవంత్ సర్కార్ పట్ల ఒక వర్గంలో వ్యతిరేకతకు కారణంగా మారింది.
ఒక్కోసారి తన దూకుడు తో ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేసి ఆయా పార్టీలను డిఫెన్స్ లో ఉంచగలుగుతున్న రేవంత్, అదే దూకుడు నిర్ణయాలతో ప్రత్యర్థులకు అస్త్రాలను వదులుతూ డిఫెన్స్ లోకి వెళుతున్నారు. రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ పాలనా పరంగా పెద్దగా అనుభవం లేకపోవడం రేవంత్ రాజకీయం పైకిలేస్తూ, కిందకు పడుతూ వైకుంఠపాళిని తలపిస్తూ ముందుకు సాగుతుంది.




