తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ, “ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి ఈ సభాముఖంగా ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్న మాట నిజమే అయితే మా పాలమూరు-రంగారెడ్డికి, మా డిండి, మా నెక్కంపాడు, మా కల్వకుర్తి తదితర ప్రాజెక్టులకు మీరు అడ్డం పడొద్దు.
మీరు బాధ్యతగా ఉండండి. మమ్మల్ని బ్రతకనీయండి. రాయలసీమకు 3 టీఎంసీల నీళ్ళు తరలించే ఆలోచన మానుకోండి. ఒకవేళ మానుకోకపోతే, మా ప్రాజెక్టులకు అడ్డంపడితే రాడి సాధించుకోవడం మాకు తెలుసు,” అని హెచ్చరించారు.
దిగువన ఉన్న ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన చేస్తే బీఆర్ఎస్ పార్టీ, దానిని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత రాద్దాంతం చేస్తున్నాయో అందరూ చూశారు.
సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీటిని వాడుకున్నా తెలంగాణ నాయకులు సిఎం చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గోదావరి నీళ్ళను దోచుకొని తెలంగాణకు ఆన్యాయం చేస్తున్నారంటూ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు.
వారు అంతగా నిందిస్తున్నా, ఏపీలో ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నా సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడకూడదని, పైగా తమకు సహకరించాలని కోరుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?
కానీ తెలంగాణ ఎంత నీరు వాడుకున్నా ఇంకా మిగులు జలాలు ఉంటాయి కనుక ఎన్ని ప్రాజెక్టులు నిర్మించుకున్నా మాకు అభ్యంతరం లేదని సిఎం చంద్రబాబు నాయుడు విస్పష్టంగానే చెపుతున్నారు కదా?
‘కేసీఆర్ పదేళ్ళు పాలించినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయకుండా వదిలేశారని’ సిఎం రేవంత్ రెడ్డి ఇదే సభలో చెప్పారు.
అంటే తెలంగాణ పాలకులు ప్రాజెక్టులు నిర్మించుకోలేక లేదా నిర్మించకుండా అలసత్వం ప్రదరిస్తూ, అందుకు పరస్పరం నిందించుకుంటూ మళ్ళీ మధ్యలో చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని ఆరోపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?
చంద్రబాబు నాయుడుని తమ ప్రాజెక్టులకు అడ్డుపడొద్దని కోరినప్పుడు తమకు ఏమాత్రం నష్టం కలిగించని బనకచర్లకు వారు కూడా అడ్డుపడకూడదు కదా?
తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్ళు పారించి మూడు పంటలకు నీళ్ళు అందిస్తామంటూ ప్రాజెక్టులు కట్టుకుంటునప్పుడు, దశాబ్దాలుగా తాగునీళ్ళకు కూడా అల్లాడుతున్న కరువుపీడిత రాయలసీమకు నీళ్ళు అందించడం మానుకోవాలని అడగడానికి రేవంత్ రెడ్డికి నోరు ఎలా వచ్చింది?
బీఆర్ఎస్ పార్టీ నీళ్ళ రాజకీయాలు చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నప్పుడు, నిన్న బహిరంగ సభలో మాట్లాడిన ఈ మాటలు ఏమిటి?అయినా ఏపీకి ఎగువన ఉన్న తెలంగాణ, దిగువన ఉన్న ఆంధ్రాతో నీళ్ళ కోసం కొట్లాడుతుండటం విడ్డూరంగా లేదూ?




