ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చాల ఘాటైన వ్యాఖ్యలే చేసారు, అలాగే బిఆర్ఎస్ పార్టీలో కవిత రేపిన కల్లోలం, తద్వారా కల్వకుంట్ల కుటుంబంలో ఏర్పడిన రాజకీయ చిచ్చు మీద స్పందించారు.
గతంలో ఉద్యమాల పేరుతో యువత ను రెచ్చకొట్టి కేసీఆర్ ఎంతోమంది ని బలితీసుకుని వారి కుటుంబాలకు పుత్ర శోకాన్ని , ఆ తల్లితండ్రులకు కడుపు కోతను మిగిల్చారు. ఇప్పుడు వారి ఉసురే కేసీఆర్ కు కూతురు కవితను దూరం చేసిందని పేర్కొన్నారు.
అలాగే బిఆర్ఎస్ ప్రభుత్వంలో తనకు తన కుటుంబానికి కలిగిన మానసిక బాధను పంచుకున్నారు రేవంత్. తన కుమార్తె వివాహ సమయంలో తనను అరెస్టు చేసి, కనీసం బైలు కూడా రాకుండా చేయడానికి కేసీఆర్ అన్ని ప్రణాళికలు వేశారని, ఆ సమయంలో తానూ కూడా తమ కుమార్తెకు దూరంగా ఉండాల్సి వచ్చిందంటూ నాటి ఘటనను మరోమారు జ్ఞప్తికి తెచ్చారు.
నాటి కేసీఆర్ పాపాలే నేడు బిఆర్ఎస్ ను కల్వకుంట్ల కుటుంబాన్ని శాపాలుగా వెంటాడుతున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అయితే రేవంత్ విమర్శలకు అటు బిఆర్ఎస్ నుంచి ఇటు కవిత నుంచి ఎటువంటి ప్రతిస్పందన వస్తుందో వేచి చూడాలి.





