రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ అధినేతల నుంచి ఆయా పార్టీల కార్యకర్తల వరకు రాజకీయ విమర్శలు హద్దులు దాటుతున్నాయా అన్న చందంగా మారుతున్నాయి.
మొన్న వైసీపీ నేత ప్రసన్న టీడీపీ మహిళా నాయకురాలు ప్రశాంతి మీద చేసిన జుగుప్సాకర విమర్శలు మరవక మునుపే నిన్న తెలంగాణలో తీన్మార్ మల్లన్న, కవిత పై రెచ్చిపోయారు.
అలాగే ఏపీలో రప్ప రప్ప అంటూ వైసీపీ అధినేత జగన్ నుంచి క్యాడర్ వరకు కూటమి ప్రభుత్వాన్ని తమ విమర్శలతో రెచ్చకొడుతుంటే నేడు తెలంగాణలో రప్ప రప్ప నినాదాన్ని బిఆర్ఎస్ అందుకుంది.
ఏపీలో జగన్ 2 .0 అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వైసీపీ, తెలంగాణలో బిఆర్ఎస్ 3 .0 లోడింగ్ 2028 లో కాంగ్రెస్ నాయకులకు మిత్తి వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూ బిఆర్ఎస్ క్యాడర్ రెచ్చిపోతుంది.
ఇక పార్టీ కార్త్యకర్తలు ఈ మాదిరిగా ఉంటే పార్టీ అధినాయకులు, నేతలు మరో చందంగా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ లో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మరోస్థాయికి చేరుకుంటున్నాయి.
ఇందులో ప్రముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ vs బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య పచ్చగడ్డి కూడా భగ్గున మండిపోతుంది అన్నట్టుగా విమర్శలు వేడి పుట్టిస్తున్నాయి.
కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ రెచ్చిపోతుంటే, రేవంత్ టార్గెట్ గా కేటీఆర్ తెగబడుతున్నారు. ఇందుకు నేడు వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలే ప్రత్యక్ష ఉదాహరణలు. నాగర్ కర్నూల్ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
కేసీఆర్..నీ డైరీ లో కాదు నీ కొడుకు గుండె పై రాసుకో, 2034 వరకు నేనే సీఎం, ఇదే నా మాట, నీకు దుఃఖం వస్తుంటే బావిలో దూకుతావో, పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటావో నీ ఇష్టం…. నువ్వు ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రావాలి, కుమిలి కుమిలి ఏడవాలి అంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి పై సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడడం రాజకీయాలకు శ్రేయస్కరం కాదు.
అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ని ఉద్దేశించి…రేవంత్ నువ్వు ఏనాటికి కేసీఆర్ స్థాయిని అందుకోలేవు, పంది ఎంత బలిసినా కూడా నంది కాలేదు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం కూడా రాజకీయాలలో ఆమోదయోగ్యమైన విమర్శలు అనిపించుకోవు.




