తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. మాజీ సిఎం కేసీఆర్ తన ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ అధికారంలోకి వస్తామని బెదిరించడంతో ముందుగా బిఆర్ఎస్ పార్టీనే సగం ఖాళీ చేసేసి కేసీఆర్కు పెద్ద షాక్ ఇచ్చారు.
అయితే లోక్సభ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొడితేనే కేసీఆర్ని కట్టడి చేయగలమని గ్రహించి దెబ్బ తీసి, ఫామ్హౌస్లో నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు.
కేసీఆర్ ఏవిదంగా తెలంగాణ ఉద్యమాలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారో, అదేవిదంగా రేవంత్ రెడ్డి కూడా రాజకీయాలలో అనేక ఎదురు దెబ్బలు తింటూ, కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు.
శ్రీరాముడు వానర సైన్యంతో మహా శక్తిశాలి అయిన రావణుడిని వదించిన్నట్లే, తన మాట అసలు వినని వానర సైన్యం వంటి కాంగ్రెస్ నేతలను వెంటబెట్టుకొని రేవంత్ రెడ్డి, అపర చాణక్యుడని పేరు మోసిన కేసీఆర్ అంతటివాడిని ఓడించి మూల కూర్చోబెట్టారు. కనుక కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి చాలా తెలివైనవారనే భావించవచ్చు.
కానీ కేసీఆర్ అంతటివాడిని రేవంత్ రెడ్డి ఓడగొట్టారనే విషయం మరిచిన కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ రేవంత్ రెడ్డిని ముప్పతిప్పలు పెట్టేస్తున్నామనే వెర్రి భ్రమలో ఉన్నారు.
రేవంత్ రెడ్డికి కావలసింది కూడా అదే. లేకుంటే ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యల జాబితా కొండంత ఉంది. ఎన్నికల హామీలు… ఆర్ధిక సమస్యలు సరేసరి!
కనుక రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా కేటీఆర్, హరీష్ రావులతో పోరాటాలు చేస్తూ ప్రజల దృష్టిని సమస్యలపై నుంచి మళ్ళిస్తున్నట్లే భావించవచ్చు.
అయితే కేసీఆర్ ఫామ్హౌస్లో నుంచి బయటకు రాకపోయినా, రేవంత్ రెడ్డి దూకుడు, వ్యూహాలను, వైఫల్యాలను నిశితంగానే గమనిస్తుంటారని వేరే చెప్పక్కర లేదు. కూతురు కవిత జైలు నుంచి బయటకు వచ్చేశాక కేసీఆర్ కూడా ఫామ్హౌస్ నుంచి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి దూకుడుకి చెక్ పెట్టే ప్రయత్నం చేయవచ్చు.
ఆ ప్రయత్నంలోనే కేసీఆర్ బీజేపీ పెద్దలతో తెర వెనుక రాయబారాలు నడుపుతున్నారని రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపిస్తున్నారు. అంటే కేసీఆర్ వలన ప్రమాదం పొంచి ఉందని రేవంత్ రెడ్డి కూడా గ్రహించిన్నట్లు భావించవచ్చు.
అందుకే కాంగ్రెస్ మంత్రులు కోరుకుంటున్న స్వేచ్ఛ, గౌరవం, ప్రాధాన్యత ఇస్తూ రేవంత్ రెడ్డి ఎవరూ పక్క చూపులు చూడకుండా జాగ్రత్తపడుతున్నట్లు భావించవచ్చు.
ఒకవేళ బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు చేతులు కలిపితే రేవంత్ రెడ్డి వాటిని ఎదుర్కోగలరా?అనే సందేహం కలుగుతుంది. అది చాలా కష్టం. కనుక ఆ రెండూ కలవకుండా చూడాలి. ఒకవేళ కలిస్తే అప్పుడు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తోడ్పాటు తీసుకోవలసి ఉంటుంది.
ఈ విషయం కూడా రేవంత్ రెడ్డి చాలా ముందే పసిగట్టారని చెప్పవచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అభినందనలు తెలిపి విభజన సమస్యలపై చర్చలకు ఆహ్వానించారని అనుకోవచ్చు.
తెలంగాణ సిఎంగా రేవంత్ రెడ్డి ఉండటం చంద్రబాబు నాయుడుకి ఎంత ముఖ్యమో, అదేవిదంగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుగా ఉండటం రేవంత్ రెడ్డికి కూడా అంతే అవసరం. అప్పుడే వారు తమ ఉమ్మడి శత్రువులు జగన్, కేసీఆర్లను కట్టడి చేయగలుగుతారు.
కనుక రేవంత్ రెడ్డి కాస్త దూకుడుగానే సాగుతున్నప్పటికీ అప్రమత్తంగానే ఉన్నారని చెప్పవచ్చు. కానీ ఈ దూకుడు, వ్యూహాలు, అప్రమత్తం మాత్రమే సరిపోదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, సమస్యలు అన్నీ తీర్చడం కూడా చాలా అవసరం అని మరిచిపోకూడదు.




