తెలంగాణ ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెను చేర్చుకోలేదు. దాంతో ఆమె రేవంత్ రెడ్డి గురించి చాలా అనుచితంగా మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచిన తర్వాత కూడా రేవంత్ రెడ్డివంటివారు ముఖ్యమంత్రి కాకుండా ఉంటేనే మంచిదంటూ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవల ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. కానీ ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు.
కనుక ఆమె పట్ల రేవంత్ రెడ్డి వైఖరి మారలేదని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్న వైఎస్ షర్మిల పట్ల ఆయన ఏవిదంగా స్పందిస్తారు? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శనివారం సాయంత్రం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంపాదకులు వేమూరి రాధాకృష్ణతో ముఖాముఖీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డిని ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఎంతో రాజకీయ పరిణతితో సమాధానం ఇచ్చారు.
“గతం గతః… నాకు అనేక భావోద్వేగాలు ఉన్నప్పటికీ షర్మిలమ్మ ఇప్పుడు మా పార్టీ నాయకురాలు. కనుక పిసిసి అధ్యక్షుడుగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తాను. పిసిసి అధ్యక్షుడుగా ఇది నా బాధ్యత కూడా.
ఏపీ కాంగ్రెస్ కోసం ఆమె ఏవిదంగా ముందుకు సాగుతారు? ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారు?టిడిపితో ఏవిదంగా వ్యవహరిస్తారు?ఆమెతో చంద్రబాబు నాయుడు ఏవిదంగా వ్యవహరిస్తారు?అనేవి వారే నిర్ణయించుకుంటారు.
జగన్మోహన్ రెడ్డిని ఓ పొరుగు రాష్ట్రం సిఎంగానే చూస్తాను. ఆయనతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి వైరం లేదు. విభజన సమస్యలపై కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునేందుకు నేను సిద్దమే. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి నాకు ఫోన్ చేయలేదు. ఆయన కేసీఆర్ని నమ్ముకొన్నట్లున్నారు. మంచిదే!
కేసీఆర్, జగన్ ఇద్దరూ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. నేను మా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నాను. మా ఇద్దరి ఆలోచనలు, దారులు వేరు. ఈసారి ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపికి ఓటమి తప్పదని భావిస్తున్నాను,” అని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
వైఎస్ షర్మిల ఆయనను ఎంత అసహ్యించుకున్నప్పటికీ, ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నాననే అహం ప్రదర్శించకుండా రేవంత్ రెడ్డి ఇంత రాజకీయ పరిణతితో వ్యవహరించడం, ఆమె పట్ల ఈవిదంగా స్పందించడం చాలా గొప్ప విషయమే.
అదే… కేసీఆర్ లేదా జగన్ ఆయన స్థానంలో ఉండి ఉంటే ఇన్ని మాటలు అన్నందుకు ఆమెను రాజకీయంగా ఎడగకుండా అణచివేసేందుకు తప్పకుండా ప్రయత్నించేవారు. కానీ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడానికి ఏవిదంగా తోడ్పడ్డారో అదేవిదంగా రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ బలపడేందుకు వైఎస్ షర్మిలకు సహకరించేందుకు సిద్దమని చెపుతున్నారు.
వైఎస్ షర్మిల, ఏపీ కాంగ్రెస్, ఏపీ రాజకీయాలు, వైసీపి పట్ల రేవంత్ రెడ్డి వైఖరి చెప్పేసిన్నట్లే భావించవచ్చు. తద్వారా ఆయన బంతిని వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డిల కోర్టులో వేశారు. కనుక ఇప్పుడు అన్నాచెల్లెలు ఏవిదంగా స్పందిస్తారో?






