వెండి బంగారాల ధర పెరిగితే…

Victims at risk as rising gold prices lead to crime and safety concerns in India

మన దేశంలో ప్రజలకు ముఖ్యంగా.. మహిళలకు వెండి బంగారాలపై మోజు గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. కనుక వెండి బంగారం ధరలు ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోవడంతో కోట్లాది మంది కన్నీళ్ళు పెట్టుకొని మరీ బాధపడుతున్నారు.

అత్యవసరంగా పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు కొనాల్సినవారు విలవిలలాడుతున్నారు. వాటిని భారీగా పోగేసుకున్నవారు తమ వద్ద ఉన్న వాటి విలువ అమాంతం పెరిగిపోయినందుకు చాలా సంతోషిస్తున్నారు. అవి లేనివారు ఏమీ చేయలేక నకిలీ ఆభరణాలతో కాలక్షేపం చేసేస్తున్నారు. వెండిబంగారాలతో… వాటి ధరలతో ఇంతమంది జీవితాలు ముడిపడున్నాయన్న మాట!

ADVERTISEMENT

వీళ్ళే కాదు మరో వర్గం కూడా ఉంది. వెండిబంగారాల ధరలు లక్ష రూపాయలు దాటిపోవడంతో, దొంగలు కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

రోడ్డుపై వెళుతున్న మహిళల మెడలో గొలుసులు లాక్కొని పారిపోయేవారు కొందరైతే, ఏకంగా ఇంట్లో జొరబడి నిలువు దోపిడీ చేసేవాళ్ళు మరికొందరు.

ఈ రెండు రకాల దొంగలే కాకుండా మరో రకం దొంగలు కూడా ఉన్నారు. ఎవరో తెలియాలంటే ఓ చిన్న తాజా స్టోరీ చెప్పుకోవాలి.

హైదరాబాద్‌లో ఓ ఇంట్లో 65 ఏళ్ళ వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తున్నారు. ఆమె మెడలో 11 తులాల బంగారం… అదే ఆమెకు ఉరితాడుగా మారింది.

ఆమె ఇంట్లో అద్దెకుంటున్న కోనసీమ జిల్లాకు చెందిన అంజిబాబు అనే క్యాబ్ డ్రైవర్ ఆమెని హత్య చేసి మరో ఇద్దరు స్నేహితుల సాయంతో శవాన్ని గోదావరిలో పడేశాడు. కానీ పోలీసులకు దొరికిపోయారు. ఇక్కడ ఆమె హత్య, కేసు గురించి చెప్పుకోవడం అవసరం లేదు.

కానీ బంగారం ధర పెరిగిపోతే మనుషుల ప్రాణాలు కూడా పోతాయనే కొత్త విషయం బయటపడింది. బంగారం ధర అంతగా పెరిగిపోవడంతో సులువుగా లక్షల రూపాయలు సంపాదించవచ్చని దొంగలు అనుకోవడం సహజం. కానీ ఎటువంటి నేర చరిత్ర లేని ఇలాంటి మామూలు మనుషులలోకూడా ఇలాంటి ప్రమాదకరమైన దుర్బుద్ధి కలగడం ఆందోళనకరమే కదా?

కనుక ముఖ్యంగా ఒంటరిగా నివసిస్తున్న మహిళలు, చదువులు, ఉద్యోగాలు పనుల మీద బయటకు వెళుతున్న మహిళలు, ఇళ్ళలోనే ఉండే వృద్ధులు ప్రతీ ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఒంటిపైనే కాదు ఇంట్లో కూడా వెండిబంగారు ఆభరణాలు ఉంచుకోవడం కూడా చాలా ప్రమాదకరమే.

తల్లితండ్రులు ముచ్చటపడి పిల్లలకు వెండి బంగారు ఆభరణాలు వేసే అలవాటు మానుకోవడం చాలా మంచిది.లేకుంటే తర్వాత తాపీగా బాధపడి ప్రయోజనం ఉండదు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ దారుణ హత్య అందరికీ ఓ మేల్కొలుపు వంటిదని గ్రహిస్తే చాలా మంచిది. వెండిబంగారాల ధరలు పెరుగుతున్న కొద్దీ మన ప్రాణాలకి ప్రమాదం కూడా పెరుగుతున్నట్లే! కనుక అందరూ తగు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories