తమిళనాడులో జయలలిత మృతి తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ మరోసారి చర్చనీయాంశంగా మారి, మళ్లీ చల్లబడిన విషయం తెలిసిందే. అయితే జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి వచ్చే నెల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో… ఆ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు అయిన గంగై అమరన్ రజనీకాంత్తో భేటీ అవడం మరోసారి ఆసక్తిని రేపుతోంది.
గతంలో రజనీకాంత్ ని ప్రధానమంత్రి మోడీ కలిసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరతారా? అనే చర్చ జరిగింది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన అభ్యర్థి రజనీతో భేటీ కావడం మళ్ళీ మీడియా వర్గాలను ఆకర్షించింది. ఇదిలా ఉంటే మరోవైపు రజనీ కొత్త పార్టీ పెడతారని కూడా భారీ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. కానీ, రాజకీయాల్లోకి వెళ్ళవద్దని మెగాస్టార్ చిరంజీవికి సలహా ఇచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్, నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అన్న సమాధానమే లభిస్తోంది.



