టాలీవుడ్ లో సచిన్ జోషి వర్సెస్ బండ్ల గణేష్ ఎపిసోడ్ కు తెరపడేలా కనపడడం లేదు. ఇద్దరూ ఒకరికొకరు తమదే న్యాయం అంటే తమదే న్యాయం అంటూ మీడియా వేదికలుగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చగా, తాజాగా సచిన్ జోషి మరోసారి బండ్ల గణేష్ ను టార్గెట్ చేసుకుని విరుచుకుపడ్డాడు. సచిన్ జోషి నటించిన “వీడెవడు” ధియేటిరికల్ ట్రైలర్ విడుదల సందర్బంగా మాట్లాడిన సచిన్, ఓ రేంజ్ లో బండ్లపై చెలరేగిపోయాడు.
“బండ్ల గణేష్ మనిషి కాదు, తోడేలు లాంటి వాడు, ఎవడినైతే నమ్మకూదదో వాడితోనే వ్యాపారం చేసాను, 27 కోట్లు దాకా ఇంకా ఇవ్వాలి, మొత్తం 14 కేసులను కోర్టులో ప్రొడ్యూస్ చేసాం, అరెస్ట్ చేయించే పరిస్థితి వచ్చినపుడు బండ్ల గణేష్ తండ్రి కాళ్ళ మీద పడడంతో జాలిపడి వదిలేసా, కోర్టు దగ్గర చూసుకుందాం అనుకున్నా, తానూ ‘ఒరేయ్ పండు’ సినిమా షూటింగ్ సమయంలో తినడానికి తిండి కూడా లేదని చెప్పి, నమ్మించి మోసం చేసాడని’ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు సచిన్.
ఇక, సచిన్ నటించిన తాజా చిత్రం “వీడెవడు” ట్రైలర్ విషయానికి వస్తే… ఓ క్రైమ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని స్పష్టమైంది. తమన్ అందించిన బాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచిన ఈ ట్రైలర్, బాలీవుడ్ సినిమా రీమేక్ గా కనపడుతోంది. సచిన్ సరసన ఇషా గుప్తా హీరోయిన్ నటించగా, ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఫేం తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు సక్సెస్ అంటే ఎరుగని సచిన్ కు ఈ సినిమా అయినా కావాల్సిన సక్సెస్ ను పంచుతుందో లేదో చూడాలి.



