ఏడాది ముగింపు సమయంలో ఆ ఏడాది ఎలా సాగింది? ముఖ్య సంఘటనలు, సినిమాలు ఇలా ప్రతీ అంశంపై మీడియా రివ్యూ చేసి వ్రాస్తుంటుంది.
ఈ 5 ఏళ్ళ వైసీపి పాలన మరో 10 రోజులలో ముగియబోతోంది కనుక దాని గురించి కూడా రివ్యూ వ్రాస్తే అది మరో పెద్ద పురాణమే అవుతుంది.
అయితే రామాయణ, మహాభారత, భాగవతాల గురించి అందరికీ తెలుసు. కానీ ఈ 5 ఏళ్ళ వైసీపి పాలన ఏవిదంగా సాగిందో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వయంగా అనుభవించి మరీ తెలుసుకున్నారు. కనుక మళ్ళీ అదంతా చెప్పుకోనవసరం లేదు.
అయితే నాడు ప్రజావేదిక కూల్చివేత నుంచి నేడు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం వరకు వైసీపి ధోరణి, వితండవాదం, కుట్రలు, కుతంత్రాలు ఏమాత్రం మారలేదు. మానుకోలేదు కూడా. కనుక రాష్ట్రంలో ప్రతీ ఒక్కరో ఏదో రూపంలో వైసీపి బాధితులే.
ఓసారి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “సమైక్య రాష్ట్రానికి, విభజిత ఆంద్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను కూడా జగన్ ప్రభుత్వ బాధితుడినే” అని చెప్పుకున్నారు. ఆయననే విడిచిపెట్టని జగన్ ప్రభుత్వం టిడిపిలో మిగిలినవారిని ఉపేక్షించదు. కనుకనే టిడిపిలో దాదాపు ప్రతీ ఒక్కరిపై కేసులు నమోదు చేసి ఈ 5 ఏళ్లుగా వేధిస్తూనే ఉంది.
ఇన్ని వేధింపులు భరిస్తూ, పార్టీని నడిపించడం, పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకోవడం, అదే సమయంలో ప్రజలకు చేరువవడం, ఎన్నికలలో గెలిచే స్థితికి పార్టీని తీసుకురావడం సామాన్యమైన విషయాలు కావు.
ఓ పక్క టిడిపి, జనసేనలను వేదిస్తూనే వాటిని కలవకుండా ఉంచడానికి, కలిసిన తర్వాత విడగొట్టడానికి వైసీపి చేసిన కుట్రలు, అవహేళనలు అందరూ చూశారు. ప్రతిపక్షాలు మేము చెప్పిన్నట్లే రాజకీయాలు చేయాలి. మేము చెప్పిన్నట్లే నడుచుకోవాలి అన్నట్లు మాట్లాడే జగన్కు పవన్ కళ్యాణ్ ఘాటుగానే బదులిచ్చారు. ప్రతిపక్షాలు ఉండేది మీ పార్టీని గెలిపించడానికి కాదు… మేము గెలవడానికే కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాము,” అని విస్పష్టంగా చెప్పారు.
కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా చాలా నిబ్బరంగా నిలబడి పోరాడుతూ విజయానికి 10 రోజుల దూరంలోకి వచ్చేశారు. తమతో పాటు తమ పార్టీలను, నేతలను, కార్యకర్తలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా గెలిపించుకోబోతున్నారు.
ఈ దశలన్నీ అయిపోయాయి. కనుక రాష్ట్రంలో తమ చెప్పు చేతల్లో పనిచేసే వాలంటీర్లను, పోలీస్ యంత్రాగాన్ని ఉపయోగించుకుని ఎన్నికలలో గెలిచేద్దామని జగన్ అనుకున్నారు. కానీ అదీ కుదరకపోవడంతో చివరి ప్రయత్నంగా చొక్కా చేతులు మడత పెట్టి యుద్ధం చేశారు కూడా. కానీ అదీ ఫలించకపోగా పిన్నెల్లి కేసుగా మారి బెడిసికొట్టింది.
దీంతో ఇప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కేంద్ర ఎన్నికల కమీషన్ని నిలదీస్తున్నట్లు మాట్లాడారు.
అంటే వైసీపి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నా కేంద్ర ఎన్నికల కమీషన్ మొదలు రాష్ట్రంలో ప్రతిపక్షాల వరకు అందరూ వాటిని సహిస్తూ సర్దుకుపోతూ వైసీపిని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తుండాలన్న మాట. అప్పుడే ప్రజాస్వామ్యం కాపాడబడిన్నట్లు… ఎన్నికలు సజావుగా జరిగిన్నట్లన్న మాట! వందల సంవత్సరాల క్రితం దేశంలో రాచరిక పాలన సాగుతున్న సమయంలో పుట్టాల్సిన వైసీపి నేతలు, ఇంత ఆలస్యంగా పుట్టడం వలననే ఈవిదంగా ఆలోచిస్తున్నారు. మాట్లాడుతున్నారనిపిస్తుంది.




