వైసీపీ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో ఎటువంటి వ్యతిరేక కార్యక్రమం జరిగినా, ఆ పార్టీ నాయకుల మీద ఎవరు విమర్శలు చేసినా దానికి కారణం చంద్రబాబు నాయుడే అంటూ వైసీపీ పార్టీ ఆవిర్బావం నుండి ప్రచారం చూసుకుంటూ వస్తున్నారు ఆ పార్టీ పెద్దలు.
వైస్సార్ మరణం పై తమకు అనుమానాలు ఉన్నాయంటూ, జగన్ పై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అక్రమ కేసులలో బాబు పాత్ర ఉందంటూ తాజాగా సజ్జల గారు పాత చింతకాయ పచ్చడికి కొత్త పోపు వేసి మళ్ళీ తిరగమాత పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే గతంలో వివేకా హత్యలో బాబు పాత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించిన వైకాపా నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల రాక పై కూడా బాబు హస్తం ఉందంటూ వైసీపీ ఆవుపాఠాన్ని మీడియా ముందు చక్కగా వల్లెవేశారు సకల శాఖ మంత్రి సజ్జల.
బటన్ నొక్కే కార్యక్రమంలో పాలకొంటున్న ప్రతి సారి జగన్, బాబు ని ఉద్దేశించి నేను మీ అందరి బాగుకోసం ఒక దుష్టచతుష్టయమం తో పోరాడుతున్నాను అంటూ చదివే చిలకపలుకులలో బాబు కు తోడుగా పవన్, రామోజీరావు,టీవీ 5 ,ఏబీఎన్ లు ఉండేవి. ఇప్పుడు ఈ కోవలోకి వైస్ షర్మిల కూడా రానుందా అంటే “వై నాట్” అనేలా ఉంది వైసీపీ వైఖరి. ఇక నుండి జగన్ దుష్టచతుష్టయమం కు మరొకరిని జోడించి మనం పోరాడబోయేది పంచ బూతులతో అంటూ పంచభూతాలను కూడా స్క్రిప్ట్ కు తగ్గట్టుగా మార్చుకుంటారేమో అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు.






