గత 5 ఏళ్ళు జగన్ శకం అనుకుంటే దానిలో సజ్జల రామకృష్ణా రెడ్డిదే ఓ పెద్ద అధ్యాయం ఉంది.
జగన్ బటన్ నొక్కుడు సభలలో మాత్రమే మాట్లాడేవారు తప్ప మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చాలా అరుదు. ఆ లోటుని పూరించడానికే సజ్జల రామకృష్ణా రెడ్డి సలహాదారుగా బరిలో దిగారు.
సలహాదారు అంటే జగన్కి సలహాలు ఇవ్వాలి. కానీ జగన్ తరపున ప్రతిపక్షాలతో బ్యాటింగ్ చేసేవారు. అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని వంటివారు సోషల్ మీడియాలో ఎంత చెలరేగిపోతున్నా సజ్జల రామకృష్ణా రెడ్డి వెర్షన్కి రాజముద్ర ఉండేది. కనుక ఆయన మాటలకి చాలా వెయిట్ ఉండేది.
ఇక వివేకా హత్య కేసైనా, జగన్పై గులకరాయి దాడి గురించైనా వైసీపి వెర్షన్ సజ్జల రామకృష్ణా రెడ్డి నోటి నుంచి వినాల్సిందే.
ఒకానొక సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి సకల శాఖా మంత్రిగా జగన్ తర్వాత నంబర్: 2 స్థానంలోకి వచ్చేస్తే ఆ స్థానంలో ఉండే విజయసాయి రెడ్డి ఢిల్లీకి మకాం మార్చక తప్పలేదు.
అయితే ఆయన తెలివిగా వ్యవహరిస్తూ నిత్యం ప్రధాని నరేంద్రమోడీ లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పెట్టుకుంటూ తాను సజ్జల రామకృష్ణా రెడ్డి కంటే చాలా పెద్ద స్థాయి అని అందరూ గుర్తించేలా చేయగలిగారు.
ఇప్పుడు ఈ సజ్జల పురాణంలో విజయసాయి రెడ్డి అధ్యాయం చేరిస్తే రసభంగం అవుతుంది కనుక అది అప్రస్తుతం.
గత 5 ఏళ్ళలో జగన్కు సమాంతరంగా ఎదిగిన సజ్జల రామకృష్ణా రెడ్డి, అలనాడు మహాభారతంలో దుర్యోధనుడిని శకుని, కర్ణుడిని శల్యుడు ముంచేసిన్నట్లే జగన్మోహన్ రెడ్డిని, వైసీపిని నిలువునా ముంచేశారని చెప్పక తప్పదు. ఈ క్రెడిట్ ఆయనకే ఎందుకంటే ‘సలహాదారు’ కనుక!
జగన్మోహన్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపి నేతలకు మద్య కనెక్షన్ కట్ చేసిన కోటరీలో సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఒకరని ఆ పార్టీలోవారే చెప్పుకుంటారు.
వైసీపి సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపికి బదులు తండ్రిని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ పార్టీలో, ప్రభుత్వంలో నంబర్: 2 స్థానానికి ఎదిగేలా చేసి తండ్రి రుణం తీర్చుకున్నారు.
అలా తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి ‘175 సీట్లు మనవే’ అనే గుడ్డి భ్రమలో ఉన్న జగన్ని అదే భ్రమలో ఉంచుతూ ఎన్నికలలో బోర్లా కొట్టించేశారు.
నిజానికి జగన్కి సజ్జల శల్య సారధ్యం చేస్తున్నారని ఎల్లో మీడియాగా ముద్ర వేయబడిన అసలైన శ్రేయోభిలాషులు పదేపదే హెచ్చరిస్తూనే ఉండేవారు. కానీ అప్పుడు ‘డ్రీమ్-175’లో జగన్ ఉన్నందున వారి హితవు వెగటుగానే అనిపించింది.
ఏది ఏమైనప్పటికీ సజ్జల తన టాస్క్ విజయవంతంగా పూర్తి చేశారు. కనుక ఇప్పుడు ఆయన ఎక్కడా కనబడటం లేదు. వినపడటం లేదు. ఆయనను జగన్ అపార్ధం చేసుకుని దూరం పెట్టి ఉండొచ్చు కానీ అంతమాత్రన్న సజ్జల స్వామిభక్తిని శంకించలేము. మళ్ళీ ఎప్పుడు అవసరమైనా సేవలు అందించేందుకు సజ్జల సిద్దంగానే ఉంటారని జగన్ మరిచిపోకుండా ఉంటే చాలు.




