సజ్జల అక్కడ ఉన్నంతవరకు కూటమి సేఫ్?

Sajjala Ramakrishna Reddy: Who Really Runs YSRCP?

సజ్జల అక్కడ ఉన్నంతవరకు కూటమి సేఫ్?

మహాభారతంలో దుర్యోధనుడు పతనానికి పాండవులు కారణమని చెప్పుకుంటాము. కానీ అతని పతనానికి ప్రధాన కారకుడు శకుని!

ADVERTISEMENT

చివరి వరకు దుర్యోధనుడి పక్కనే ఉంటూ తప్పులు చేయిస్తూ చివరికి దుర్యోధనుడితో సహా యావత్ కౌరవ వంశం నాశనం అయ్యేలా చేశాడు. అదేవిదంగా వైసీపీలో సజ్జల రామకృష్ణ రెడ్డి అండ్ సన్స్ కూడా జగన్‌ వెంటే ఉంటూ వైసీపీని అధోగతి పాలు చేశారని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.

కాకపోతే శకునికి, సజ్జలకు ఒకటే తేడా. శకుని దుర్యోధనుడి పతనానికి కారకుడైనప్పటికీ అతని కోసమే యుద్ధం చేసి ప్రాణాలు వదిలాడు. కానీ సజ్జల వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఈ దుస్థితికి తీసుకువచ్చినా విడిచిపెట్టడం లేదు!

మొదట్లో జగన్‌ ఆయనని పక్కన పెట్టేశారు. కానీ విజయసాయి రెడ్డి కూడా వెళ్ళిపోవడంతో మళ్ళీ సజ్జలని తెచ్చి నంబర్: 2 కుర్చీలో కూర్చోబెట్టక తప్పలేదు.

తనని తిరిగి తెచ్చుకోక తప్పని పరిస్థితి సజ్జల కల్పించారా లేదా ఓటమి కారణంగా సజ్జల లేకుండా వైసీపీని నడిపించలేని దయనీయస్థితికి జగన్‌ దిగజారారా? అని ఆలోచిస్తే రెండింటికీ సజ్జలే కారకుడని చెప్పక తప్పదు. కనుక వైసీపీలో మళ్ళీ ‘సజ్జల హవా’ మొదలైంది.

కనుక ఎప్పటిలాగే అయన జగన్‌కి పార్టీ శ్రేణులకి మద్య అడ్డుగోడగా మారి అంతా తానై పార్టీని నడిపిస్తున్నారు. వైసీపీని సజ్జల నడిపిస్తున్నారని చెప్పడానికి అమరావతి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలే చక్కటి నిదర్శనం.

జగన్‌ అమరావతిని వద్దనుకొని విశాఖ రాజధాని అంటే, ‘ఇప్పుడు జగన్‌ కూడా అమరావతినే రాజధానిగా అంగీకరించారని’ సజ్జల చెప్పారు. రాజధాని విషయంలో జగన్‌ విధానానికి పూర్తి భిన్నంగా సజ్జల బహిరంగంగా మాట్లాడటం గమనిస్తే, వైసీపీకి జగన్‌ కాదు… సజ్జలే దిశానిర్దేశం చేస్తున్నట్లు అర్ధమవుతుంది.

అమరావతికి జగన్‌ జై కొట్టారంటూ సజ్జల బహిరంగంగా చెప్పినా, జగన్‌ ఆయన మాటలను ఖండించలేదు. సమర్ధించలేదు. మౌనంగా ఉండిపోయారు! తద్వారా సజ్జల చేతిలోనే వైసీపీ ఉందనే భావన అందరికీ కల్పించారు.

కనుక సజ్జల యధాప్రకారం జగన్‌కు శల్య సారధ్యం చేస్తూ వైసీపీని పూర్తిగా ముంచేయాలని కంకణం కట్టుకున్నట్లే ఉన్నారు. కనుక ఆ నంబర్: 2 కుర్చీలో సజ్జల కూర్చునంత వరకు కూటమి ప్రభుత్వం దిగులు పడాల్సిన అవసరం ఉండదు. పడితే గిడితే వైసీపీ నేతలు, కార్యకర్తలే పడాలి!

ADVERTISEMENT
Latest Stories