వైసీపి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సంక్షేమ పధకాలను ప్రజలకు అలవాటు చేసింది. సచివాలయాలకు, కరెంటు స్తంభాలకు కూడా వైసీపి రంగులు వేశారు. ప్రతీ పనికి ముందు వెనుక జగన్ పేరు తగిలించి జనం చేత కూడా జగనన్న జపం చేయించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు మరే పనిలేన్నట్లు గడప గడపకు తిరిగారు. వైసీపి సంచీలు భుజానికి తగిలించుకొని ఇంటింటికీ తిరిగి ‘మా నమకం, మా భవిష్యత్ నువ్వే జగన్’ స్టిక్కర్స్ అంటించారు. సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సులు వేసుకొని తిరిగారు.
మరోపక్క చంద్రబాబు నాయుడుని టిడిపి నేతలను లోపల వేసేసి అడ్డు తొలగించుకొని ఎన్నికలకు వెళ్ళేందుకు పెద్ద ప్లాన్ వేశారు.
ఇన్ని చేసినా ఇంకా ‘వై ఏపీ నీడ్స్ జగన్?’ (ఏపీకి జగన్ ఎందుకు అవసరం?) అని ప్రజలకు, ప్రతిపక్షాలకు కలగాల్సిన సందేహం వైసీపి నేతలకే కలగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని వైసీపి ఆస్థాన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పారు.
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ పాలన మహాద్భుతమని రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఇటువంటి పాలన నభూతో నభవిష్యత్ అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సజ్జలవారు అభివృద్ధికి సరికొత్త నిర్వచనం చెప్పారు.
‘జగన్ పాలనలో సంక్షేమ పధకాలతోనే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతోంది. దాని ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. కనుక సంక్షేమమే అభివృద్ధి. అభివృద్ధి అంటే సంక్షేమమే,” అని తేల్చి చెప్పేశారు.
అభివృద్ధి అంటే సంక్షేమమే అని నిసిగ్గుగా చెప్పుకోవడం బహుశః ఆయనకే చెల్లునేమో?రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లించలేకపోతోంది. పక్కనే ఉన్న తెలంగాణలో జరుగుతున్న ఆర్ధిక, పారిశ్రామిక, ఐటి. వ్యవసాయ, సాగునీటి రంగాలలో అభివృద్ధితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడో కూడా చెప్పలేని దుస్థితి. కనీసం ‘మా రాజధాని ఇదని’ అటు వైసీపి నేతలు కానీ అటు రాష్ట్ర ప్రజలు గానీ ధైర్యంగా చెప్పుకోలేని దుస్థితి. అయినా మనమే మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శం అని ఎలా చెప్పుకోగలుగుతున్నారో తెలీదు.
కానీ ఏపీలో నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి వైసీపి నేతలకు తెలియదనుకోలేము. అందుకే వారికి కూడా ‘ఏపీకి జగన్ ఎందుకు అవసరం?’ అనే సందేహం కలిగిన్నట్లుంది. దానికి ప్రజలే సమాధానం చెప్పగలరు కనుక మళ్ళీ వారి వద్దకే బయలుదేరుతున్నారు పాపం!
—




