తెలంగాణాలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ‘కుందనపు బొమ్మ’ సమంతను మంత్రి కేటీఆర్ నియమించిన విషయం తెలిసిందే. ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా, అప్పటికప్పుడు ప్రకటించి ఒక బోకే సమంతకు ఇచ్చి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే దీనిపై రాజకీయ విమర్శలు తలెత్తనప్పటికీ, దీని వెనుక చాలా బ్యాక్ గ్రౌండ్ ఉందని ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ.
రాజకీయాల్లో కేటీఆర్ ఓ బచ్చా అని, సినీ హీరో నాగార్జునతో కేటీఆర్ కు లావాదేవీలు ఉన్నాయని… అందుకే చేనేతకు బ్రాండ్ అంబాసడర్ గా నాగార్జునకు కాబోయే కోడలు, హీరోయిన్ సమంతను నియమించారని ఆరోపణలు చేసారు. నిజానికి ఈ లైన్ ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు గానీ, షబ్బీర్ అలీ చేసిన ఆరోపణల్లో ఎంతో కొంత వాస్తవం ఉందంటున్నారు నెటిజన్లు. ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి మద్దతు పలకడం నాగ్ వంతు కావడంతో, అందులో భాగంగానే కేటీఆర్ తో సఖ్యతగా ఉండి తన పనులు కానిచ్చుకుంటున్నారన్న టాక్ ఉంది.
నాగ్ ను అడ్డం పెట్టుకుని కేటీఆర్ పై చేసిన ఆరోపణలకు తోడు పలు రాజకీయ విమర్శలు కూడా చేసారు. రాష్ట్రంలో వైద్య విధానం కూడా సరిగా లేదని… వైద్యం పడకేసిందని… తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. వైద్య పరిస్థితిపై గవర్నర్ నరసింహన్ సమీక్ష నిర్వహించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. రొటీన్ రాజకీయ విమర్శలు సహజమే గానీ, సమంత బ్రాండ్ అంబాసిడర్ వ్యవహారం మాత్రం మీడియా వర్గాలకు హాట్ టాపిక్ అయ్యింది.



