సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ఎంత అగ్రెసివ్గా కనిపిస్తారో, మీడియా ఇంటరాక్షన్స్లోనూ అదే ఇంటెన్సిటీ చూపిస్తారు. తాను నమ్మిన విషయాన్ని బలంగా సమర్థించుకోవడం ఆయన స్టైల్. ముఖ్యంగా తన సినిమాల విషయంలో అస్సలు వెనక్కి తగ్గరు.
అదే సమయంలో ఆయన చాలా నో నాన్సెన్స్ వ్యక్తిలా కనిపిస్తారు. ఎక్కువగా సినిమా గురించే మాట్లాడతారు. సమాజంలో జరిగే ప్రతి విషయం మీద తన తెలివిని ప్రదర్శించాలనే ప్రయత్నం సాధారణంగా చేయరు.
ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా ‘రొమాంచికం’ అనే చిన్న సినిమాతో వస్తున్నారు. సెప్టెంబర్ 3న విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 2న హైదరాబాద్లో జరిగింది. తన ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండను ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు.
అయితే ఈ ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించింది వంగా స్పీచ్.
తన బ్యానర్ నుంచి వస్తున్న సినిమా అయినా ఆయన ఒక్క అంగుళం కూడా ఓవర్గా వెళ్లలేదు. అనవసరమైన హైప్ ఇవ్వలేదు. ఇదో అద్భుతం, ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు అంటూ భారీ మాటలు చెప్పలేదు.
ఈ రోజుల్లో హీరోలు, దర్శకులు సైడ్గా చిన్న సినిమాలు నిర్మిస్తే ఓపెనింగ్స్ కోసం చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ వంగా మాత్రం చాలా సింపుల్గా మాట్లాడారు. ఇది ఫ్రెష్ సినిమా అని చెప్పారు. దర్శకుడిని నమ్మానని, సినిమా చూడాలని ప్రేక్షకులను కోరారు.
మొత్తం స్పీచ్లో ఆయన చాలా నవ్వుతూ కనిపించారు. సినిమా గురించి చెప్పాల్సింది మాత్రమే చెప్పారు. ‘మేం సినిమా తీశాం… ఇక ప్రేక్షకులే నిర్ణయించాలి’ అన్నట్టుగా వదిలేశారు. సాధారణంగా తన సినిమాల విషయంలో ఎలా ఉంటారో, తాను పెట్టుబడి పెట్టిన ‘రొమాంచికం’ విషయంలోనూ అలాగే ఉన్నారు.
కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిన్న బడ్డీ కామెడీ నిర్మాతగా వంగాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇలాంటి సినిమాల టార్గెట్ పరిమితంగానే ఉంటుంది. దర్శకుడు కావాల్సినంత ఫ్రెష్నెస్, ఎంటర్టైన్మెంట్ అందిస్తే మాత్రం పెద్ద విజయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది.
మరి నిర్మాతగా సందీప్ రెడ్డి వంగా ఎంత లక్కీనో ‘రొమాంచికం’ మరోసారి నిరూపిస్తుందేమో చూడాలి.







