మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న సోషల్ మీడియాలో ఓ పెద్ద లెటర్ పోస్ట్ చేశారు. దానిలో సజ్జల రామకృష్ణా రెడ్డి వల్లనే తనను అవమానించేవారని, అయనే పొగ పెట్టి బయటకు వెళ్ళిపోయేలా చేశారంటూ సజ్జలపై అనేక ఆరోపణలు చేశారు. వాటిపై నేడు సజ్జల మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.
“వైఎస్ కుటుంబంతో 40 ఏళ్ళ అనుబంధం ఉందని చెప్పుకున్న విజయసాయి రెడ్డి అకస్మాత్తుగా పార్టీని వీడి వెళ్ళిపోయారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు నా వల్ల పార్టీ వీడాల్సి వచ్చిందని కొత్త మాట చెపుతున్నారు.
పైగా నా చేతిలో జగన్, వైసీపీ బందీలుగా మారారని పార్టీలో నేనే నం.1, జగన్ నం.2 అంటూ పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆయన చేసిన ఈ ఆరోపణలకు సమాధానం చెప్పకపోతే పార్టీ శ్రేణుల్లో అయోమయం, అపోహలు ఏర్పడుతాయని భావించి మీడియా ముందుకు వచ్చి ఈ వివరణ ఇస్తున్నా,” అని సజ్జల అన్నారు.
సజ్జల ఏమన్నారంటే, “వైసీపీలో జగన్ ఒక్కరే నం.1 నాతో సహా మిగిలినవారందరూ కేవలం కార్యకర్తలే!ఆయన నాయకత్వంలో పార్టీ చాలా స్థిరంగా, బలంగా ఉంది. వైసీపీలో ఎటువంటి కోటరీ లేదు. అది టీడీపి సృష్టించిన పదం మాత్రమే.
“జగన్ చాలా సౌమ్యుడు. అందుకే ఎవరినీ ఎన్నడూ విమర్శించరు. మమ్మల్నీ విమర్శించనీయరు. కానీ విజయసాయి రెడ్డి ఆరోపణలకు జవాబు చెప్పకపోతే పార్టీ శ్రేణుల్లో అపోహలు ఏర్పడతాయని ఈ వివరణ ఇస్తున్నా,” అని సజ్జల అన్నారు.
మున్ముందు సజ్జల ఇలాంటి వివరణలు చాలా ఇవ్వాల్సి రావచ్చు. కానీ సజ్జల మాటలని నమ్మేదెవరు? కనీసం వైసీపీ నేతలైనా నమ్ముతారా? వైసీపీని వీడిన ప్రతీ ఒక్కరూ సజ్జల కారణంగానే పార్టీ సర్వనాశనం అయ్యిందని ఆరోపిస్తూనే ఉన్నారు.
పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల, సోషల్ మీడియాలో అయన కొడుకు భార్గవ్ రెడ్డి చేసిన నిర్వాకం వల్లనే గత ఎన్నికలలో పార్టీ దారుణంగా ఓడిపోయిందని పలువురు ఆరోపించారు.
జగన్ కూడా ఇలా అనుకోవడం వల్లనే ఓటమి తర్వాత సజ్జలను పక్కన పెట్టేశారు. అయితే మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడటానికి జగన్ తడబడుతుంటారు కనుక మళ్ళీ సజ్జలను తెచ్చి పెట్టుకున్నారు. దీనిని జగన్ బలహీనతగా సజ్జల భావిస్తే తప్పుకాదు.
అందుకే మళ్ళీ వైసీపీలో పెత్తనం చలాయించడం ప్రారంభించారు. నేటికీపార్టీ నేతలు, వైసీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే సజ్జల అడ్డుగోడగా నిలుస్తున్నారు.
బోరుగడ్డ అనిల్ కుమార్ ఇటీవల తన భార్యతో కలిసి జగన్ని కలిసేందుకు తాడేపల్లి ప్యాలస్కు వస్తే సజ్జల అనుచరులు లోనికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. అప్పుడు బోరుగడ్డ దంపతులు అక్కడే ధర్నా చేశారు కూడా. వైసీపీలో సజ్జల అడ్డుగోడగా మారారని చెప్పేందుకు నిదర్శనం కాదా? విజయసాయి ఇదేగా చెప్పారు.






