సంక్రాంతి తర్వాత జగన్ తాడేపల్లి ప్యాలస్లో నుంచి బయటకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని దడదడలాడించేస్తారని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటే ఆయన సంక్రాంతి తర్వాత కుమార్తె డిగ్రీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు లండన్ బయలుదేరి వెళుతున్నారు.
జగన్ తుమ్మినా దగ్గినా కూడా లోకానికి గట్టిగానే వినిపిస్తుంది. కనుక పాస్పోర్టు వ్యవహారం కూడా అలాగే వినిపించింది. దాని కోసం నిరభ్యంతర పత్రం కోసం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకి వెళ్ళేందుకు జగన్కు అహం అడ్డం వచ్చినందున హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. హైకోర్టు ఆయనకు నిరభ్యంతర పత్రం మంజూరు చేయడంతో అక్కడితో ఓ అధ్యాయం ముగిసింది.
సంక్రాంతి పండుగకు ముందో తర్వాతో జగన్ లండన్కి ఎగిరిపోవడం ఖాయమని తేలిపోయింది కనుక ఆయన కోసం ఎదురు చూస్తున్న నేతలు, కార్యకర్తలు తమకి కూడా ‘రాజకీయ సెలవులు’ లభించాయని సంతోషపడాలో లేదా తమ మెడలకు కేసులు ఉచ్చులా బిగుసుకుంటుంటే అధినేత విదేశాలకు వెళ్ళిపోతున్నారని బాధ పడాలో తెలీదు.
తాను తిరిగి వచ్చేవరకు వైసీపీ నేతలకు కాలక్షేపానికి “ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పధకాలు ఎందుకు అమలుచేయడం లేదు?” అంటూ ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడుకోమని జగన్ ఇప్పటికే ఓ లైన్ ఇచ్చేశారు. కనుక వాటితో వారు కాలక్షేపం చేసుకోగలరు.
ఈసారి సంక్రాంతి పండుగకి సత్తెనపల్లి సంబరాల రాంబాబు రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంటే దాంతో ఆయనకీ మంచి కాలక్షేపమే.
వైసీపీలో కోర్టులు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళవలసినవారు తప్ప మిగిలిన నేతలు జగన్ తిరిగి వచ్చే వరకు ఇళ్ళలో హాయిగా పండగ చేసుకోవచ్చు.




