సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. ఇంటి ముందు రంగవల్లులు, వీధులలో భోగి మంటలు, హరిదాసుని కీర్తనలు, గంగేరెద్దుల కోలాటాలు, కోడి పందాల కొట్లాటలు, గాలిపటాల పోటీలు, పిండి వంటల విందు భోజనాలు, కొత్త పంటల ఆనందాలు…ఇలా ప్రతి పల్లె కూడా సంక్రాంతి శోభను సంతరించుకుంటుంది.
అలాగే ఆ సంక్రాంతి ఆనందాలను, కళను ఆస్వాదించేందుకు నగరాల నుంచి పట్టణాల నుంచి ఎందరో పల్లెబాట పడుతుంటారు. ముఖ్యంగా హైద్రాబాద్, బెంగళూర్ వంటి మహా నగరాలలో ఉండే వారు తమ డైలీ రొటీన్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవడానికి తమ సొంతూరికి ప్రయాణమవుతారు.
అయితే ఇలా సామాన్య ప్రజానీకమే కాదు నిత్యం తమ తమ రాజకీయ యుద్ధాలతో ప్రత్యర్థుల పై కత్తులు దూసే బడా రాజకీయ నేతలు సైతం సంక్రాంతికి తన సొంతూర్లకు సమయాన్ని కేటాయిస్తారు. వారి పండుగ సంబరాలు సొంతూర్లలో, సొంతవారి మధ్య సరదాగా జరుపుకుంటారు.
పండుగ అంటే పిండివంటలో, ప్రయాణాలో కాదు పలకరింపులు, ఆప్యాతలు, అనుబంధాలు అనేలా ఎవరికీ వారు వారి సొంతవారిని కలిసేందుకు సంక్రాంతిని ఒక వారధిలా వాడుకుంటారు. ఈ నేపథ్యంలో పల్లెలు సంక్రాంతి కాంతులతో, బంధు మిత్రుల సందళ్ళతో కళకళలాడుతుంటే,
నగరాలు మాత్రం నో కాంతి అన్నట్టుగా ఇళ్లకు తాళాలు వేసుకుని బిక్కుమంటుంటాయి. నిత్యం ఉరుకుల పరుగుల జీవితాలతో బిజీ బిజీగా గడిపే హైద్రాబాద్ వాసులు ఈ పండుగ పూట మాత్రం తమ సొంతూళ్లకు ప్రయాణమవుతారు.
దీనితో నిత్యం బిజీ ట్రాఫిక్ తో, హార్న్ సౌండ్లతో గందరగోళంగా ఉండే హైద్రాబాద్ రోడ్లన్నీ సంక్రాంతి వేళ నిశ్శబ్దంతో, ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇక ఎప్పుడు సైలెంట్ గా ఉండే పల్లెలలో మాత్రం పండుగ కళతో సందడిగా మారతాయి.
ఇప్పటికే సంక్రాంతి వీకెండ్ రద్దీ విజయవాడ – హైద్రాబాద్ రహదారులలో బారులు తీరింది. అలాగే ప్రయాణికులతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్ ను కిక్కిరిపోతున్నాయి. ఇక సందట్లో సడేమియా అన్నట్టుగా ప్రవైట్ రవాణా సంస్థలు ఈ పండుగ హడావుడిని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు.







