సూపర్ స్టార్ నటించిన ‘కబాలి’ మొదటి రోజు వసూళ్ళు 250 కోట్లు అని చెప్పి అందర్నీ అవాక్కు చేసిన చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను తాజాగా మరొక సంచలన ప్రకటన చేసారు. ‘ఫోర్బ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సదరు నిర్మాత, ‘కబాలి’ సినిమా సీక్వెల్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నామని, దాదాపుగా ఈ అంశం ఇప్పటికే ఖాయమైందని అన్నారు.
‘కబాలి’ క్లైమాక్స్ లో రజనీకాంత్ పోలీసులకు లొంగిపోతాడని ప్రకటించగా, తెలుగు క్లైమాక్స్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తుపాకీ పేలుడు శబ్దం వినిపించడం, ఆ బుల్లెట్ కు రజనీకాంత్ చనిపోయాడా? లేదా? అనే విషయాన్ని మాత్రం దర్శకుడు పా.రంజిత్ చూపించలేదు. ఆ తర్వాత ఏం జరిగిందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండిపోయింది. దీంతో, ‘కబాలి’ సీక్వెల్ ఉందన్న సంకేతాలను సినిమా ద్వారానే ప్రకటించగా, తాజాగా నిర్మాత దానిని ధ్రువపరిచారు.
అయితే ఈ సినిమాలో సూపర్ స్టార్ వయసు మీద పడడం స్పష్టంగా కనపడింది. కొన్ని కొన్ని సన్నివేశాలలో నడవడానికే కాస్త ఇబ్బందులు పడిన తీరు సిల్వర్ స్క్రీన్ పై స్పష్టంగా తెలిసింది. మరి, ‘కబాలి’ సీక్వెల్ అన్న వార్తలు కేవలం అభిమానులను ఉత్తేజపరచడానికేనా? లేక సీక్వెల్ లో హీరో మార్పు ఉంటుందా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే ఈ సీక్వెల్ వార్తలు నెటిజన్లలో నవ్వును పూయిస్తున్నాయి. ‘కబాలి’ విడుదలకు ముందు వరకు సైలెంట్ గా ఉన్న నిర్మాత, విడుదల తర్వాత మాత్రం సంచలన ప్రకటనలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు.



