ప్రభుత్వ శాఖలలో దేవాదాయ ధర్మాధాయ శాఖ ఒకటి. కనుక ఆ శాఖలో ఖాళీలు ఏర్పడినప్పుడు నిబందనల ప్రకారమే భర్తీ చేస్తారు. మిగిలిన శాఖలలో కులమతాలతో సంబంధం లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు. కానీ దేవాదాయశాఖ హిందూ ఆలయాలని పర్యవేక్షిస్తుంటుంది. కనుక దానిలో ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయి.
అయినప్పటికీ హిందువులకు పరమపవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో అన్య మతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకు వారిని తప్పు పట్టలేము. కానీ వారికి ఆ అవకాశం కల్పించిన దేవాదాయ ధర్మాధాయ శాఖని, రాజకీయ నాయకులను తప్పు పట్టాల్సి ఉంటుంది.
ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమలలో అన్యమతస్థుల హడావుడి పెరిగిపోయింది. కొట్లాదిమంది ఎంతో భక్తితో పూజించే శ్రీవారి విగ్రహం వారికి కేవలం ఓ రాతి విగ్రహాం మాత్రమే. అందువల్లే పవిత్రమైన లడ్డూ ప్రసాదం నెయ్యిలో కల్తీ జరిగిన 5 ఏళ్ళకు గానీ బయటపడలేదు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో అన్యమతస్తులను వేరే చోటికి బదిలీ చేసి, కల్తీ నెయ్యిని అరికట్టింది. కానీ నేటికీ తిరుమలలో వెయ్యి మంది అన్యమతస్తులు పని చేస్తున్నారంటే నమ్మశక్యం కాదు. కానీ ఈ విషయం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నోట వినాల్సివచ్చింది.
ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్ తిరుమల ఆలయంలో పనిచేస్తున్న వెయ్యి మంది అన్యమతస్థులను తక్షణం వేరే ఉద్యోగాలకు బదిలీ చేయాలని మీడియా ద్వారా ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసి పనిచేద్దామని చెప్పడం ద్వారా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్కి కూడా ప్రత్యేకంగా చెప్పినట్లే భావించవచ్చు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉద్యమిస్తానని పవన్ కళ్యాణ్ తిరుపతి పట్టణంలోనే ప్రకటించారు. కనుక తిరుమల నుంచే అది మొదలుపెడితే బాగుంటుంది కదా?




