విజయమ్మ, జగన్, షర్మిల ముగ్గురూ ఆస్తుల గొడవలతో మీడియాకి ఎక్కి తమ కుటుంబం పరువు, ముఖ్యంగా జగన్ పరువు పోగొట్టుకున్నారు.
అయితే తిరుమల కల్తీ నెయ్యి రాజకీయ వేడికి కరిగి హటాత్తుగా మాయం అయిపోయిన్నట్లు, మీడియాలో హటాత్తుగా వారి ఆస్తుల పంచాయితీల వార్తలు, విశ్లేషణలు కూడా ఆగిపోయాయి. అంటే ముగ్గురూ రాజీ పడ్డారా?
అంటే జగన్ గురించి ఇంత తెలిసినవారు ఆ అవకాశమే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. వారి ఆస్తుల పంచాయితీ టాపిక్ని బాగా అరగదీసేసి ప్రజలకు బోర్ కొట్టించేశామని భావించిన మీడియా బహుశః వేరే హాట్ టాపిక్కి షిఫ్ట్ అయిపోయి ఉండవచ్చు.
ఇంతకాలం జగన్ తల్లి విజయమ్మ వైఎస్ కుటుంబాన్ని కలిపి ఉంచేవారు. కానీ ఈ ఆస్తుల పంచాయితీ మొదలైన తర్వాత ఆమె ‘గాంధారిలా కళ్ళుండి కూడా వాస్తవాలు చూడలేకపోతున్నారని’ తేల్చి పడేయడంతో జగన్ జాబితాలో ఆమె పేరు కూడా తొలగించేసిన్నట్లే భావించవచ్చు.
కనుక ఇదివరకు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతీ మాటకు ముందూ, వెనుకా చేర్చి పలికిన ‘మన ప్రియతమ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ అవసరం మళ్ళీ పడిన్నట్లుంది. అందుకే వైసీపి సోషల్ మీడియాలో మళ్ళీ ప్రతీరోజూ ఆయన ఫోటోలు కనిపిస్తున్నాయి. వాటితో ఆయన ఎంత గొప్పవారో తెలియజేస్తూ, ఆయన వారసత్వాన్ని జగన్ క్లెయిమ్ చేసుకుంటున్నట్లున్నారు.
నిజానికి జగనే ఆయన ఆస్తులకు, రాజకీయాలకు కూడా వారసుడు అని అందరికీ తెలిసి ఉన్నప్పుడు మళ్ళీ పనిగట్టుకొని ఎందుకు క్లెయిమ్ చేసుకోవలసి వస్తోంది? అంటే చెల్లి షర్మిల వలనే.
వినాయక చవితినాడు చంద్రుడిని చూడటం వలన నీలాప నిందలకు గురవకుండా వినాయక వ్రత కధ చదివి, అక్షింతలు జల్లుకుంటాము. అదేవిదంగా ఈ రాజకీయాలు, ఆస్తుల విషయంలో తల్లీ, చెల్లీ వలన కలిగిన నీలాపనిందలు తొలగించుకోవడానికి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీవెనలు జగన్కు అవసరం పడి ఉండొచ్చు.
తన క్యారక్టర్ ఎటువంటిదో అందరికీ అర్దమైపోయింది. కనుక మళ్ళీ ఆయన ఫోటో చూసి ప్రజలు తనని మళ్ళీ ఆదరిస్తారనే ఆశ కావచ్చు లేదా ఆయనకి అసలు సిసలు వారసుడు తానేనని, ఈ విషయంలో చెల్లి షర్మిలకు ఎటువంటి హక్కులు లేవని చెప్పుకునేందుకు కావచ్చు.
కారణాలు ఏవైనప్పటికీ మళ్ళీ చాలా కాలం తర్వాత జగన్ తన సోషల్ మీడియాలో తండ్రికి ఈవిదంగా స్థానం కల్పించి, గౌరవిస్తుండటం చాలా అభినందనీయమే… కదా?




