ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎవరి రేంజ్ కు తగిన విధంగా కలెక్షన్స్ రాబట్టాయి. మూడు సినిమాలు కూడా ఆయా హీరోల కెరీర్ లో ఆల్ టైం రికార్డులను సృష్టించాయి. అయితే చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల సినిమాల మధ్యన ఒక సినిమా విడుదల చేయాలంటే కాస్త గట్స్ ఉండాల్సిందే. అలాంటి గట్స్ నే దిల్ రాజు – శర్వానంద్ లు ప్రదర్శించి, “శతమానం భవతి” బొమ్మను బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిపారు.
ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ‘జనతా గ్యారేజ్’ వంటి టాప్ హీరో సినిమా 52వ రోజే స్మాల్ స్క్రీన్ పై ప్రదర్శించడంతో ప్రారంభమైన ట్రెండ్ ను ‘శతమానం భవతి’ కూడా కొనసాగిస్తోంది. ఈ ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్ లో ఈ సినిమా ప్రదర్శితం కాబోతోంది. మంచి ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమా కావడంతో, బుల్లితెరపై కూడా ‘శతమానం భవతి’ అందరి ఆశీర్వాదాలు అందుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.
అయితే అదే రోజు ‘బాహుబలి 2’ ఆడియో వేడుక ఉండడం కాస్త ప్రతికూలమైన అంశమనే చెప్పవచ్చు. ట్రైలర్ విడుదలైన తర్వాత ‘బాహుబలి 2’పై ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఆడియో వేడుకను పక్కనపెట్టి, ‘శతమానం భవతి’ సినిమాకు పట్టం కడతారా అన్నది రానున్న టీఆర్పీ రేటింగ్స్ చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ పై సరైన టైంలో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా, స్మాల్ స్క్రీన్ పై మాత్రం రాంగ్ ఎంట్రీ ఇస్తోందన్నది సినీ అభిమానుల వాదన.



