మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడిగా నటుడు శివాజీ రాజా ఏకగ్రీవంగా ఎంపికైన విషయం తెలిసిందే. అధ్యక్షుడి ఎన్నికతో పాటు మిగిలిన సభ్యులు ఎంపిక కూడా జరిగింది. 2019 వరకు ఈ పదవిలో శివాజీ రాజానే కొనసాగనున్నారు. అయితే ప్రస్తుతం ‘మా’కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కనిపించకపోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.
‘మా’ అధ్యక్షుడిగా శివాజీ రాజాను ఏకగ్రీవంగా ఎంపిక చేసినప్పటి నుండి రాజేంద్ర ప్రసాద్ కనిపించకపోవడం విశేషంగా చెప్పుకుంటున్నారు. బహుశా మా అధ్యక్షుడి పదవికి శివాజీ రాజాను ఎన్నుకోవడం రాజేంద్ర ప్రసాద్ కు ఇష్టం లేదనే అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే, గత రెండేళ్లుగా ‘మా’ అభ్యున్నతికి రాజేంద్ర ప్రసాద్ బాగానే కృషి చేశారని, ‘మా’ అధ్యక్ష బాధ్యతలు రెండోసారి కూడా ఆయనకే దక్కుతాయని నటకిరీటీ వర్గీయులు భావించినట్లుగా తెలుస్తోంది.
కానీ ‘మా’ కోసం శివాజీరాజా కష్టపడటాన్ని చూసిన సినీ పెద్దలు, ఆ పదవిని ఆయనకే కట్టబెట్టాలని అనుకోవడంతో రాజేంద్రప్రసాద్ కు మరొక ఆప్షన్ లేకుండా పోయింది. అయితే ప్రస్తుత అధ్యక్షుడి హోదాలో అయినా ప్రెస్ మీట్స్ కు రాజేంద్ర ప్రసాద్ హాజరు కాకపోవడం, ‘మా’ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికపై కనీసం తన స్పందన తెలియజేయక పోవడంతో విమర్శలు తలెత్తుతున్నాయి. దీంతో ఇండస్ట్రీలో ‘నటకిరీటి’ కనిపించడం లేదంటూ ప్రచారం ఊపందుకుంది.



