నేటి సమాజాన్ని కొద్దీ కొద్దిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది సోషల్ మీడియా. పసి పిల్లలకు అవసరమైన పద్యాల నుంచి విద్యార్థులకు అవసరమైన చదువుల వరకు, కడుపు నింపే ఫుడ్ ఐ టమ్స్ తయారీ నుంచి ఫుడ్ పండించే విధానాల వరకు ప్రతి అంశం మీద నేటి సమాజం ఈ సోషల్ మీడియా మీద ఆధారపడుతూనే వస్తుంది.
అయితే ఇదంతా టెక్నాలిజీ మహిమ, సోషల్ మీడియా మాయాజాలం అంటూ సమాజం కూడా ఒక మంచి ఉద్దేశం తోనే ముందుకెళ్తుంది. కానీ ఇదే సోషల్ మీడియాను మరో కోణం లో చూస్తూ వాటిని దుర్వినియోగం చేసే వ్యక్తులు కూడా ఇదే సమాజంలో మనతో కలిసి జీవిస్తున్నారు.
డిజిటల్ దొంగతనాలతో మొదలైన ఈ టెక్నాలజీ అప్ డేట్ డిజిటల్ బెదిరింపులకు వరకు పాకాయి. అలాగే నేటి సమాజంలో ఈ సోషల్ మీడియా ప్రేమ గాధలు కూడా తరచూ వార్తలలో వినిపిస్తూనే ఉంటున్నాయి. అయితే వాటిలో సింహ భాగం ప్రేమలు మాయ, మోసాలుగానే మిగులుతున్నాయి.
సోషల్ మీడియాలో ఫేక్ ఫొటోలతో మొదలైన ఈ ఆకర్షణలు, తీపి కబుర్ల చాటింగ్ తో మరో మెట్టు ఎక్కి, ఆ తరువాత హద్దులు దాటి మోసపోయారంటూ చివరికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు కొందరు. ఇక మరికొందరు ఈ డిజిటల్ పరిచయానికి ప్రేమ అనే పేరు పెట్టి నమ్మించి ఆర్థికంగా దండుకుంటున్నారు.
అయితే ఇందులో బాధితుల నిష్పత్తి మాత్రం ఆడ, మగ అనే తేడా లేకుండా సరిసమంగా ఉంటుంది. కొంతమంది ఏళ్లుగా సహజీవనం చేసి కూడా ఒకరిని ఒకరు సరిగా అర్ధం చేసుకోలేకపోయాం అంటూ విడిపోతున్న నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రేమలు నిలబెట్టుకోవడం అంటే లైక్స్, షేర్స్ కొట్టినంత ఈజీ కాదు అనే చెప్పాలి.
పొద్దున్న లేస్తే ఎక్కడో అక్కడ ఈ సోషల్ మీడియా ప్రేమ కథలు అవి మిగిల్చిన చేదు విషాద ముగింపులను నేటి సమాజం కళ్ళ ముందు చూస్తూ కూడా మళ్ళీ ఆ మాయలోనే మరికొంతమంది చిక్కుకుని తమ భవిష్యత్ ను చేచేతుల ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు.
మోసం చేసే వాడు ఉన్నంత కాలం మోసపోవడమే అని సరిపెట్టుకోవడం కాదు మోసపోయేవాడు ఉన్నన్ని రోజులు మోసం చేసే వాడు ఉంటూనే ఉంటాడు అని గ్రహించాలి. అప్పుడే ఈ డిజిటల్ మోసాలు, సోషల్ మీడియా ఫేక్ ప్రేమల బారిన పడకుండా తమను తాము కాపాడుకోగలుగుతారు.







