జగన్ నిన్న నెల్లూరు పర్యటనలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. దీనిపై జగన్ తన కోణంలో మాట్లాడగా, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తమ కోణంలో నుంచి మాట్లాడారు.
జగన్ ఏమన్నారంటే, “నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి ఆయనని హత్య చేయించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేయగా ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. సిఎం చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలు చేయిస్తున్నారు,” అని ఆరోపించారు.
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమన్నారంటే, “జగన్ని మేము ప్రజలలో తిరగనీయకుండా అడ్డుకుంటున్నామని, తనను అడ్డుకునేందుకు వేలాదిమంది పోలీసులను మోహరించామని ఆరోపించారు. కానీ అదే నోటితో తనకు భద్రత కల్పించడం లేదని చెపుతున్నారు. మరి వేలాదిమంది పోలీసులు దేని కోసం మోహరించినట్లు?
జైల్లో ఉన్న కాకాణిని పరామర్శించేందుకు జగన్ పోలీసుల అనుమతి తీసుకున్నారు. కానీ అయన చేసిందేమిటి? వేలాదిమందిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు?అసలు జగన్ కాకాణిని పరామర్శించాడానికే నెల్లూరు వచ్చారా లేదా బలప్రదర్శన చేయడానికా?
ఆయన వైసీపీ కార్యకర్తలని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోవాలా?” అని సోమిరెడ్డి ప్రశ్నించారు.
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఏమన్నారంటే, “నేను నియోజకవర్గంలో పనులు చేయించకపోతే వాటి గురించి నన్ను ప్రశ్నిస్తే తప్పు కాదు. కానీ నేను మహిళని కనుక నాపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం ఏ రకం రాజకీయం?
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందని మీ నాయకుడు మీరు వాదిస్తుంటారు. మరోపక్క మీరే మహిళలని ఈవిదంగా కించపరుస్తుంటారు. మీకు బుద్ధి చెప్పాల్సిన మీ నాయకుడు మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చి మళ్ళీ మమ్మల్నే విమర్శిస్తారు. మీ నాయకుడే ఈవిదంగా ఉన్నప్పుడు మీరందరూ హుందాగా వ్యవహరిస్తారని ఎలా అనుకోగలం?” అని ప్రశాంతి రెడ్డి అన్నారు.
హత్యా రాజకీయాలంటే వివేకానంద రెడ్డి హత్య, తదనంతర పరిణామాల గురించే చెప్పుకోవలసి ఉంటుంది. తెలుగు సస్పెన్స్ సినిమాలో హంతకుడు కళ్ళ ముందే తిరుగుతున్నా ఎవరూ గుర్తుపట్టలేరు. కానీ సినిమా ముగిసే సరికి తప్పకుండా బయటపడతాడు. కానీ వివేకా హత్య కేసులో నిందితులు కళ్ళ ముందే తిరుగుతున్నా ఎవరూ పట్టుకోలేకపోతున్నారు కదా?






