గాలే వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు నుండి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా, నాలుగవ రోజుకల్లా మ్యాచ్ ను విజయవంతంగా ముగించింది. రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లి సెంచరీ పూర్తి చేసిన అనంతరం ఇన్నింగ్స్ ను 240/3 వద్ద డిక్లేర్ చేసి, శ్రీలంకకు 550 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. దీంతో వరుణుడు అడ్డుకోకపోతే టీమిండియా విజయం సాధించడం స్పష్టమైంది గానీ, నాలుగవ రోజే విజయం దక్కుతుందని మాత్రం ముందుగా ఊహించినది.
మరో వైపున శ్రీలంక జట్టులో ఇద్దరు ఆటగాళ్ళకు గాయం కావడం కూడా ఓ రకంగా కలిసొచ్చింది. మొదటి ఇన్నింగ్స్ లో కూడా ఒక ఆటగాడు బరిలోకి దిగని విషయం తెలిసిందే. భారీ లక్ష్య చేధనలో ఏ దశలోనూ శ్రీలంక పోరాట పటిమను ప్రదర్శించలేకపోయింది. ఓపెనర్ కరుణరత్నే (97) మరియు కీపర్ డిక్ వెల్లా (67) మినహా మిగతా వారంతా చేతులేత్తేయడంతో 76.5 ఓవర్లలో 245 పరుగులు చేసిన శ్రీలంక ఆలౌట్ అయ్యింది. దీంతో 304 పరుగుల భారీ విజయం టీమిండియా సొంతమైంది.
శ్రీలంక జట్టు రెండు ఇన్నింగ్స్ లను కలిపినా, టీమిండియా మొదటి ఇన్నింగ్స్ కు చేరుకోకపోవడం విశేషం. టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్ – జడేజాలు చెరో 3 వికెట్లు తీయగా, షమీ, యాదవ్ లు చెరో వికెట్ పడగొట్టారు. మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయితే అత్యంత విస్తుగొలిపే విషయం ఏమిటంటే… ఈ మ్యాచ్ పట్ల క్రికెట్ ప్రేమికులు కూడా పెద్దగా ఆసక్తి కనపరచకపోవడం. ‘వార్ వన్ సైడ్’గా మారిపోవడంతో… ఏ మాత్రం కిక్ పంచని మ్యాచ్ గా మిగిలిపోయింది.



