వెండితెర ఇలవేల్పు శ్రీదేవి చివరగా ‘మామ్’ అనే సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ సినిమా శ్రీదేవి చివరి సినిమా కాదని బాలీవుడ్ వర్గాల సమాచారం. శ్రీదేవి చివరి సినిమా షారూక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘జీరో’ అని సమాచారం. ఈ సినిమాలో ఆమె పూర్తి స్థాయి పాత్ర పోషించనప్పటికీ… చివరి సారి సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను పలకరించేది మాత్రం ఈ సినిమాతోనేనని తెలుస్తోంది.
‘జీరో’ సినిమాలో ఆమె నిజ జీవిత పాత్రలోనే (స్టార్ హీరోయిన్ శ్రీదేవిగా) కనిపించబోతున్నారట. ఓ పార్టీ సీన్ గా కనిపించే ఈ సన్నివేశంలో షారూక్, అలియా భట్, కరిష్మాకపూర్ లతో కలిసి సందడి చేస్తారని, దీనికి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తైందని బాలీవుడ్ కథనాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమాకు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తుండగా, రాయ్, రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ సంస్థలు నిర్మిస్తున్నాయి.



