ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్ట్ 15 నుంచి స్త్రీశక్తి పధకం అమలవుతోంది. ఇంత కాలం మహిళలు టికెట్ కొనుకొని ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ ఖర్చు తప్పింది. కనుక మహిళలు చాలా సంతోషిస్తున్నారు.
ముఖ్యంగా విద్యార్ధినులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలు, చిరు వ్యాపారులు, రోజువారి కూలి పనులు చేసుకునేవారికి ఈ పధకంతో చాలా ఉపశమనం లబిస్తోంది. కనుక అందరూ చాలా సంతోషిస్తున్నారు. కనుక దీనిని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపి నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు.
నలుగురికీ ఉపయోగపడే ఓ మంచి పని చేసి, దాని ఫలితం ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు ఎవరైనా ఇలాగే స్పందిస్తారు. కనుక స్త్రీశక్తి గురించి టీడీపి గొప్పగా చెప్పుకోవడం చాలా సహజం. ఈ పధకం మొదలయ్యి ఇంకా రెండు రోజులే అయ్యింది కనుక కొన్ని రోజులు లేదా వారాలపాటు టీడీపి హడావుడి తప్పక ఉంటుంది.
కానీ ఏ పధకం, కార్యక్రమం గురించైనా అతిగా గొప్పలు చెప్పుకుంటే ఏదో రోజు దానిలో లోపాలు బయటపడినప్పుడో లేదా అమలు చేయలేక, నిబంధనల పేరుతో ఆ భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేసినప్పుడు అందరూ తప్పక వేలెత్తి చూపకమానారు.
ఉదాహరణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళిత బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అతిగా గొప్పలు చెప్పుకునేది. ఆ పేరుతో ఎన్నికలలో ఓట్లు రాబట్టుకునేది. అంటే ‘క్రెడిట్ అడ్వాన్స్’ లేదా ‘అడ్వాన్స్ క్రెడిట్’ తీసుకోవడమన్న మాట!
కానీ ఆ తర్వాత వాటి కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ప్రజాగ్రహానికి గురై ఎన్నికలలో ఎదురుదెబ్బ తింది. స్త్రీశక్తి విషయంలో టీడీపి… నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే రేపు ఇలాగే జరుగవచ్చు.
ఇప్పటికే వైసీపీ స్త్రీశక్తి పధకం అమలవుతున్న తీరు గురించి విమర్శలు గుప్పిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూనే ఉంది. కనుక టీడీపి నేతలు దానిని దీటుగా ఎదుర్కొంటూనే అది ఈ పధకంలో ఎత్తి చూపుతున్న సమస్యలని లేదా లోటుపాట్లని సవరించే ప్రయత్నం చేస్తే మంచిది. లేకుంటే స్త్రీశక్తి వలన కూటమి ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రజాభిమానం వైసీపీ దుష్ప్రచారంలో కొట్టుకుపోయి, చివరికి సమస్యలే అందరికీ కనపడతాయి.






