ఏపీలో జగనన్న ఆదరించకపోవడంతో తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించి ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలకు తొలిసారిగా టిఆర్ఎస్ పవర్ ఏమిటో రుచి చూడబోతున్నారు. ఇంతకాలం ఆమె సిఎం కేసీఆర్పై, మంత్రులపై, టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నా, ఎన్ని ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోలేదు. కానీ తొలిసారిగా ఆమెపై టిఆర్ఎస్ నేతలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంగళవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆమె చాలా హద్దుమీరి తప్పుడు ఆరోపణలు చేస్తూ సిఎం కేసీఆర్, తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.
ఆయన వెంటనే వారి ఫిర్యాదును సభా హక్కుల సంఘం కమిటీకి పంపించారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదన్నట్లు టిఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ఆజ్ఞ, ఆమోదం లేనిదే ఏదీ జరగదని తెలిసిందే. కనుక వైఎస్ షర్మిలపై సిఎం కేసీఆర్కి ఆగ్రహం కలిగినందునే ఆమెపై చర్యలకు సిద్దం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇంతకాలం వైఎస్ షర్మిలను టిఆర్ఎస్ పట్టించుకోకపోవడం వలననే ఆమె తెలంగాణలో పాదయాత్రలు చేయగలుగుతున్నారు. అదే కారణంగా ఆమె పాదయాత్రకు అంతగా ప్రజలలో గుర్తింపు కూడా లభించడం లేదు. కనుక ఒకవేళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకొంటే తెలంగాణ రాజకీయాలలో ఆమెకు గుర్తింపు కల్పించినట్లవుతుంది. అప్పుడు ఆమె ఏవిదంగా స్పందిస్తారో తేలికగానే ఊహించవచ్చు. ఆమె మరింత రెచ్చిపోయి కేసీఆర్ మీద, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు, ఆరోపణలు చేస్తారు. వాటితో టిఆర్ఎస్ ప్రతిష్ట మసకబారవచ్చు కానీ ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రగిలే అవకాశం ఉంటుంది. మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్కి ఇది చాలా అవసరం.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య సత్సంబందాలు లేనప్పటికీ వాటిని నడిపిస్తున్న టిఆర్ఎస్, వైసీపీ నేతల మద్య బలమైన సంబంధాలే ఉన్నాయి. కనుక మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్కు మరింత తోడ్పడేందుకు వైసీపీ మంత్రులు, వారి ఆత్మసాక్షి కూడా వైఎస్ షర్మిలపై చర్యలు తీసుకొన్నందుకు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించవచ్చు.
ఏపీ నుంచి వచ్చిన వైఎస్ షర్మిల, ఆమె తరపున ఏపీలోని వైసీపీ మంత్రులు తమ ముఖ్యమంత్రి కేసీఆర్ని విమర్శిస్తే తెలంగాణ ప్రజలకు సహజంగానే ఆగ్రహం కలుగుతుంది. ఆ ఆగ్రహమే సెంటిమెంట్గా మారుతుంది. అది మునుగోడు ఉపఎన్నికలలో ఓట్ల రూపంలో టిఆర్ఎస్కు బదిలీ కావచ్చు. బహుశః ఇందుకే జగనన్న వదిలిన బాణాన్ని ఇంతకాలం కేసీఆర్ ఉపేక్షించారేమో?ఈ వాదన నిజమో కాదో త్వరలోనే తెలుస్తుంది.



