తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన వారంతా ఒక్కొక్కరుగా అశువులు బాస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఈ ‘మిస్టరీ’ సీక్వెల్ లో తాజాగా మరో ఉదంతం చేరింది. జయలలిత మరణం తర్వాత కొందరు హత్యకు గురి కాగా, మరికొందరు యాక్సిడెంట్ల రూపంలో తనువులు విడిచారు. అలాగే ఇంకొందరు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసారు. ఈ మూడవ కోవకు సంబంధించి మరో సంఘటన చోటు చేసుకుంది.
జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమెకు సేవలందించిన నర్సు గ్లోరియా ఆత్మహత్యాయత్నం చేసింది. చెన్నైలోని ఐనావరం నాగేశ్వర గురుస్వామి వీధిలో నివసిస్తున్న ఆమె నిద్రమాత్రలు మింగారు. తనతో పాటు ఇద్దరు పిల్లలు ప్రవీణ్ (7), సుజిత్ (6)లకు కూడా నిద్రమాత్రలు వేసింది. స్పృహ కోల్పోయిన వీరందరినీ అపోలో ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. దీంతో ప్రాణాపాయం తప్పి, ప్రస్తుతం వీరంతా శ్రేయస్కరంగానే ఉన్నారు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలేంటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత నాలుగు నెలల క్రితం గ్లోరియా భర్త విజయ్ కుమార్ స్టేషనరీ షాపును నడుపుతూ గుండెపోటుతో మరణించాడు. దీంతో ఆపదలో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులలో ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఇతర వేరే కారణాలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితమే జయలలిత మరణం విషయంలో అపోలో ఆసుపత్రి చైర్మెన్ బహిరంగ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. మొత్తానికి జయలలిత కేంద్రంగా జరుగుతున్న ఈ ‘మిస్టరీ’కి శుభంకార్డు ఎప్పుడు పడుతుందో చూడాలి.



