వైసీపీ సోషల్ మీడియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అధికారంలో ఉన్నప్పుడే కాదు లేనప్పుడూ చెలరేగిపోతూనే ఉంది. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సోషల్ మీడియా అడ్మిన్గా వ్యవహరిస్తున్న పవన్కు పులివెందుల పోలీసులు నోటీస్ పంపారు. వివేకా హత్య కేసులో ఏ-2 నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ పిర్యాదు మేరకు పోలీసులు పవన్ని విచారణకు హాజరు కావాలంటూ నోటీస్ ఇచ్చారు.
సునీల్ యాదవ్ ఈరోజు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ని కలిసి, ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీకి చెందిన కొందరు పెద్దల వలన తనకు ప్రాణహాని ఉందని కనుక తనకు రక్షణ కల్పించాలని కోరారు.
ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రధాన సాక్షులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారని, తనను ఏదో రోజు హత్య చేస్తారని సునీల్ యాదవ్ మీడియాతో అన్నారు. సునీల్ యాదవ్ పిర్యాదుపై వెంటనే స్పందించి పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తున్నారు.
వివేకా హత్యనే గుండెపోటుగా చిత్రీకరించాలనుకున్నవారు, ఆ తర్వాత ఈ కేసు మెడకు చుట్టుకోవడంతో విచారణ ముందుకు సాగకుండా కేసుల మీద కేసులు వేస్తూ కదలకుండా నిలిపివేసినప్పటికీ, మన న్యాయస్థానాలు వారిని సవాలుగా తీసుకొని ఈ కేసు విచారణ కొలిక్కి తీసుకువచ్చి నిందితులకు శిక్షలు విధించలేకపోయాయి.
ఓ రాజకీయపార్టీ దానిలో రాజకీయ నాయకులు రాజ్యాంగ వ్యవస్థల కంటే చాలా శక్తివంతులని ఈ కేసు నిరూపిస్తోంది.
ఈ కేసులో ఇదో కోణం అనుకుంటే, ఆనాడు వైసీపీ పెద్దలని నమ్ముకొని వివేకా హత్యలో పాల్గొన్నవారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడటం మరో కోణం.
జగన్ తాను సంక్షేమ పధకాలతో ప్రజలకు చాలా మేలు చేశానని పదేపదే చెప్పుకుంటారు. కానీ ఈ కేసులన్నీ చూస్తుంటే వైసీపీలో వారికి కూడా జగన్ తీరని అపకారం చేశారని చెప్పక తప్పదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా వివేకా హత్య కేసులో జైలుకి వెళ్ళినవారు, వెళ్ళివస్తున్న వారు, ప్రాణాలు కోల్పోతున్నవారు, ప్రాణ భయంతో బ్రతుకుతున్నవారు మన కళ్ళెదుటే ఉన్నారు కదా?
ఆర్ధిక నేరాలు, హత్యలు, పోర్టు కబ్జాలు వంటివే కాక, జగన్ అండదండలు చూసుకొని రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఎవరికి వారు చేసిన తప్పులకు కుప్పలు తెప్పలుగా కేసులు నమోదవుతూనే ఉండటం గమనిస్తే, వారు కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నప్పటికీ లోలోన తమని తాము, తమ అధినేతని నిందించుకోకుండా ఉంటారా?




