వివేక హత్య కేసులో నేడు కీలక పరిణామం జరిగింది. ఆయన కుమార్తె, అల్లుడు సునీతారెడ్డి రాజశేఖర్ రెడ్డిలతో పాటు సీబీఐ విచారణాధికారి రామ్ సింగ్పై వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన తప్పుడు కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కే సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత వారు ముగ్గురిపై నమోదు చేసిన కేసులను కొట్టివేస్తున్నట్లు తీర్పు చెప్పింది.
గత ఎన్నికలలో ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి హత్య గురించి పదేపదే మాట్లాడిన వైసీపీ నేతలు ఎవరూ ఓటమి తర్వాత ఈ కేసు గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా వైసీపీ సీనియర్ లాయర్లా వాదించే సజ్జల రామకృష్ణా రెడ్డి కానీ ఈ కేసులో చిత్ర విచిత్రమైన కట్టుకధలు వినిపించిన వైసీపీ సొంత మీడియా గానీ నేడు సుప్రీంకోర్టు చెప్పిన ఈ తీర్పుపై స్పందించలేదు.
అదే… సుప్రీంకోర్టు ఈకేసులో ఏమాత్రం అనుకూలంగా మాట్లాడినా అది పట్టుకొని సజ్జల, వైసీపీ సొంత మీడియాతో సహా అందరూ ఈపాటికి చెలరేగిపోతుండేవారు.
ఇంతకాలం సునీతా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి నిందితులని, సీబీఐ విచారణాధికారి రామ్ సింగ్ ఈ కేసును వారికి అనుకూలంగా తారుమారు చేయాలని కుట్రలు చేశారని, వారికి చంద్రబాబు నాయుడు సహకరించేవారని జగన్ & కో వాదిస్తుండేవారు.
కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వారి వాదనలు తప్పు, అబద్దమని స్పష్టమైంది. కనుక వారు ఈ నేరం చేయనప్పుడు మరెవరు చేశారు? అని ఆలోచిస్తే సమాధానం అందరికీ తెలుసు. కనుక సీబీఐ తలుచుకుంటే ఈ కేసును అతి త్వరలోనే ముగించగలదు. కానీ దానికి బిగించిన బ్రేకులు తొలగించాల్సి ఉంటుంది.






