చిన్నారులకు లాలిపాడుతూ, కధలు చెపుతూ నిద్ర పుచ్చుతుంటారు తల్లులు. అదేవిదంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు కూడా టికెట్, నామినేటడ్ పదవులు దొరకని నేతలను త్వరలో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అప్పుడు తప్పకుండా మీకు సీటు లభిస్తుందని జోలపాడి శాంతింపజేస్తుంటారు.
కానీ రెండు రాష్ట్రాలలో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడే సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కోరుతూ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దానిపై సుదీర్గ విచారణ జరిపిన తర్వాత నేడు తుది తీర్పు వెల్లడిస్తూ ఈ పిటిషన్ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
అదే విభజన చట్టంలో 2026లో జనగణన తర్వాత ని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని స్పష్టంగా ఉందని, కనుక దీని కోసం కేంద్రానికి నోటీస్ జారీ చేయలేమని చెపుతూ పిటిషన్ కొట్టివేసింది.
వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో, మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మార్చి 2027 నుంచి జన గణన జరపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చింది. కనుక అది పూర్తయ్యే వరకు శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగదు. కానీ సుప్రీంకోర్టు ఏదైనా సానుకూలంగా తీర్పు చెపుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న రాజకీయ నిరుద్యోగులు అందరికీ నిరాశ పరిచింది.






