సినీ పరిశ్రమలో పెట్టుబడి, ఆదాయం, వ్యాపారం ఉంటాయి కనుక సినీ పరిశ్రమలో వారికి ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి. అది చాలా అవసరం కూడా. అయితే ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమై ప్రజలు సన్మార్గంలో నడిపించే స్వామీజీలకు ప్రభుత్వంతో ఏం పని? రాజకీయ నాయకులతో రాసుకుపూసుకు తిరగాల్సిన అవసరం ఏమిటి?అసలు రాజకీయాలు వారికెందుకు?అంటే అవసరమే అంటున్నారు విశాఖలో శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి.
ఆయన మాజీ సిఎం రాజగురువుగా వ్యవహరించేవారు. అలాగని జగన్ హయాంలో ఆలయాలలో జరిగిన అపచారాలను, విగ్రహాల విధ్వంసాలు, దొంగతనాలను ఏనాడూ ఖండించింది లేదు. ఇటువంటి పనులు తగవని జగన్కు చెప్పింది లేదు.
కానీ జగన్ హిందూ మతాన్ని గౌరవిస్తారని చాటింపు వేసునేందుకు స్వామీజీని పావుగా ఉపయోగించుకునేవారు. అందుకు ప్రతిగా విశాఖ జిల్లా కొత్తవలసలో శారదా పీఠానికి 15 ఎకరాలు ఇచ్చేశారు. అక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం సుమారు రూ.10-12 కోట్లు ఉండగా కేవలం రూ.15 లక్షల చొప్పున స్వామీజీకి ధారాదత్తం చేసేశారు.
పేద ప్రజలు నివసించేందుకు సెంటు (48 గజాలు) భూమి సరిపోతుందని భావించిన జగన్, తన రాజగురువు స్వరూపానందేంద్ర స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి 15 ఎకరాలు చాలా అవసరమని భావించి కట్టబెట్టేశారు.
ప్రజలకు ధర్మం గురించి ప్రవచనాలు చెప్పే స్వామీజీ వందల కోట్లు విలువ చేసే ఆ భూమిని అలా నామమాత్రపు ధరకు తీసుకోవడం తప్పని భావించలేదు.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన్నట్లు ప్రభుత్వ భూమిని స్వామీజీకి జగన్ అప్పనంగా ధారాదత్తం చేస్తున్నప్పుడే స్థానిక ప్రజలు, టిడిపి, జనసేనలు ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ అభ్యంతరాలు చెప్పినా పట్టించుకోలేదు.
కానీ ఆధ్యాత్మిక విషయాలతో పాటు రాజకీయాలను కూడా ఔపోసన పట్టిన స్వామీజీకి ప్రభుత్వం మారితే తన పరిస్థితి కూడా మారుతుందని గ్రహించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే శారదా పీఠానికి కొత్తవలసలో కేటాయించిన భూమిపై విచారణ జరిపి, దాని కోసం జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోని రద్దు చేస్తూ మరో జీవో జారీ చేసి ఆ భూమిని వెనక్కు తీసుకుంది. దాంతోపాటు తిరుమల కొండపై శారాదా పీఠం చేపట్టిన నిర్మాణాలను నిలిపివేయాలని టీటీడీని ఆదేశించింది.




