తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమా ‘అభినేత్రి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మిల్కీబ్యూటీ తమన్నా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అభినేత్రి’ గురించి చెప్తూ… ఇటువంటి సినిమాలు గతంలో తెలుగులో వచ్చాయని పేర్కొంది. ఇక ఈ సినిమాలో ఓ ఫ్రెండ్లీ దెయ్యం ఉంటుందని, ఇందులో తాను దేవి అనే గ్రామీణ గృహిణిగా, రూబీ అనే మోడ్రన్ అమ్మాయిగా నటించినట్టు తెలిపింది.
“బాహుబలి” సినిమాలో నటించాక పాత్రల విషయంలో ప్రయోగాలు చేసే అవకాశం దక్కిందని, అదే ‘అభినేత్రి’కి కారణమని పేర్కొంది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం కంటే మూడు భాషల్లో ఒక దాని తర్వాత ఒక భాషలో డైలాగ్స్ చెప్పడమే కష్టమనిపించిందని తెలిపింది. ఒకేసారి మూడు భాషల్లో సినిమా చెయ్యడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది. మూడు వెర్షన్ల కోసం డైలాగ్స్ చెప్పడం, డ్యాన్సుల్లో ఆయా భాషలకు తగ్గట్టుగా పెదాల కదిలిక ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా కష్టమని వివరించింది.
ఆ సమయంలో తాను ఎంత బాధ అనుభవించిందీ తనకు మాత్రమే తెలుసని పేర్కొంది. నిజానికి మూడు భాషల్లో చెయ్యాలనే ‘బ్యాడ్ ఐడియా’ ఇచ్చింది తానేనని తెలిపింది. మొదట తమిళం, హిందీలోనే ఈ సినిమాను చెయ్యాలని అనుకున్నారని, కానీ తెలుగులోనూ మార్కెట్ ఉంటుందన్న తన సలహాతో ‘అభినేత్రి’ త్రిభాషా చిత్రంగా రూపుదిద్దుకుందని వివరించిందీ ఈ మిల్కీ బ్యూటీ.



