తమిళనాడు కేర్ టేకర్ సీఎం పన్నీర్ సెల్వం నుంచి కఠిన మాటలు వస్తున్నాయి. రోజురోజుకూ స్వరం పెంచుతోన్న పన్నీర్, శశికళపై మరోసారి నిప్పులు చెరిగారు. పోయిస్ గార్డెన్ లోని అమ్మ నివాసం నుంచి శశికళను బయటకు తరిమేస్తానని హెచ్చరించారు. చిన్నమ్మపై ఇంత కటువుగా పన్నీర్ వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి. పోయస్ గార్డెన్ లో ఉండే హక్కు ఆమెకు లేదని, ఆ ఇంటిని అమ్మ స్మారక కేంద్రంగా మారుస్తానని తెలిపారు. గవర్నర్ ఎదుట తన బలాన్ని నిరూపించుకుంటానని, కాబోయే సీఎంను తానేనని స్పష్టం చేశారు.
అమ్మకు వీర విధేయురాలిగా చెప్పుకునే శశికళ, అమ్మకు ఇష్టం లేని తన కుటుంబ సభ్యులను తిరిగి ఎందుకు అక్కున చేర్చుకున్నారని, అవినీతి కేసులున్న వ్యక్తుల ప్రవేశంతో పోయిస్ గార్డెన్ ను అపవిత్రం చేశారని నిప్పులు చెరిగారు. శశికళకు ధైర్యముంటే ఎమ్మెల్యేలను బయటకు పంపి, గవర్నర్ ఎదుట బలాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. పన్నీర్ చేసిన వ్యాఖ్యలు కేవలం మాటల వరకే పరిమితం అవుతాయనుకుంటే పొరపాటే..! ఎవరూ ఊహించని విధంగా తను చేసిన వ్యాఖ్యల దిశగా పన్నీర్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
జయలలిత నివాసమైన పోయస్ గార్డెన్ లోని ‘వేద నిలయం’ భవంతిని జయ మెమోరియల్ గా మారుస్తూ పన్నీర్ సంతకం పెట్టనున్నారని, ఆ వెంటనే నిర్ణయం అమల్లోకి వచ్చి, శశికళ బయటకు వెళ్లాల్సి వస్తుందని తెలుస్తోంది. ఈ భవనంలో జయలలిత వాడిన వస్తువులు, ఆమెకు వచ్చిన జ్ఞాపికలు తదితరాలతో మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు పన్నీరుకు ఎమ్మెల్యేల బలం కూడా పెరుగుతూ ఉండడంతో, శశికళకు చుక్కలు చూపిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
తాజాగా 22 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీర్ నాయకత్వానికి మద్దతు పలకగా, మరో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వీరు కూడా పన్నీర్ కే జై కొడతారనే అంచనాలు ఉన్నాయి. శరవేగంగా మారుతున్న పరిణామాలతో తమిళ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు పన్నీర్ కు మద్దతు ప్రకటించడంతో శశికళ వర్గంలో కలకలం మొదలైంది.



