నాడు సీబీఐ ఆఫీసుకి.. నేడు ప్రధానితో భేటీ

Tamil Nadu CM Vijay meeting Prime Minister Narendra Modi in Delhi amid TVK BJP political discussions

టీవీకే పార్టీ అధినేత విజయ్‌ తమిళనాడు సిఎంగా బాధ్యతలు చేప్పటిన తర్వాత తొలిసారిగా బుధవారం ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోడీని మర్యాద పూర్వకంగా కలిశారు.

ప్రధాని మోడీ విజయ్‌ ముఖ్యమంత్రి అయినందుకు అభినందనలు తెలిపారు. ఇరువురూ సుమారు అర్ధగంట సేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. తమిళనాడుకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు మంజూరు చేసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని సిఎం విజయ్‌ ప్రధాని మోడీని అభ్యర్ధించినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

గత ఏడాది కరూర్ పట్టణంలో విజయ్‌ టీవీకే పార్టీ ర్యాలీ నిర్వహించినప్పుడు తొక్కిసలాత జరిగి 40 మంది చనిపోయారు. ఆ ఘటనపై సీబీఐ కేసు నమోదు చేయడంతో విజయ్‌ విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్ళి వస్తుండేవారు.

కానీ ఇప్పుడు తమిళనాడు సిఎం హోదాలో విజయ్‌ ప్రధాని మోడీ నివాసానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మర్యాదలతో ఆహ్వానం లభించింది.

తమిళనాడు ఎన్నికలలో టీవీకే పార్టీతో పొత్తుకి బిజేపి విశ్వప్రయత్నాలు చేసింది. కానీ అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఈ కేసుతో వేధించిందని, విజయ్‌ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల కాకుండా అడ్డుకుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.

కానీ టీవీకే పార్టీ శాసనసభలో బల నిరూపణ చేసుకున్నప్పుడు 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. వారిలో ముగ్గురు ఇటీవలే తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరిపోయారు.

తమిళనాడులో అన్నాడీఎంకే, బిజేపిల మద్య పొత్తు ఉంది. కనుక వారి మద్దతు వెనుక బిజేపి హస్తం ఉందా? లేక సిఎం విజయ్‌ తన ప్రభుత్వ మనుగడ కోసం మనసు మార్చుకొని బిజేపితో చేతులు కలిపేందుకు సిద్డమయ్యారా?

నిన్న ప్రధాని మోడీతో సిఎం విజయ్‌ భేటీతో రెండు పార్టీలు దగ్గరవుతాయా? లేదా సిఎం విజయ్‌ వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఆయనకు సహకరిస్తుందా లేదా?వంటి పలు ప్రశ్నలకు ఈ భేటీలో సమాధానాలు లభించి ఉండవచ్చు.

ఒకవేళ విజయ్‌పై సీబీఐ కేసు అటకెక్కిపోయి, జన నాయగన్‌ రిలీజ్‌కి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేస్తే బిజేపి-టీవీకే పార్టీల మద్య అవగాహన ఏర్పడినట్లే భావించవచ్చు. ఇందుకు భిన్నంగా పరిస్థితులు మారితే సిఎం విజయ్‌ వైఖరిలో మార్పు లేదని, కనుక విజయ్‌ ప్రభుత్వానికి మొసళ్ళ పండుగ ముందుందని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories