తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితులపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శనివారం నాడు గవర్నర్ పర్యటన తర్వాత, జయ ఆరోగ్యం కుదుటపడిందని సమాచారం రాజ్ భవన్ నుండి వెలువడడంతో కాస్త స్థిమితపడ్డ పార్టీ వర్గాలు, కార్యకర్తలకు అపోలో హెల్త్ బులిటెన్ మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. రక్తనాళాల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో ప్రపంచంలో పేరుగాంచిన బ్రిటన్ వైద్యుడు డా.రిచర్డ్ జాన్ బేలే నాలుగు రోజుల క్రితం చెన్నైకు విచ్చేసి జయకు చికిత్స అందించారు.
అయితే ఈ డాక్టర్ చెన్నైను వీడి లండన్ పయనమయ్యాడు. జాన్ బేలే నేతృత్వంలో పరీక్షలు నిర్వహించిన చికిత్స చేసిన బృందానికి పాజిటివ్ సంకేతాలు వచ్చాయని, దీంతో సదరు బృందం సంతృప్తి వ్యక్తం చేస్తూ… స్వదేశానికి తిరుగు పయనం అయ్యారని ‘అమ్మ’ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మునుపటితో పోలిస్తే… జయలలిత ఆరోగ్యం ప్రస్తుతం బాగా మెరుగయ్యిందని చెన్నై వర్గాల టాక్. అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా ఈ ‘గోప్యం’ ఎన్నాళ్ళ వరకు దాచుతారో చూడాలి.
జయలలిత హాస్పిటల్ ప్రభావంతో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బంది కలగడంతో, ఆమెకు అత్యంత నమ్మకస్తులైన ఆరుగురు సభ్యుల బృందం పాలనా పగ్గాలు చేపట్టినట్టు ఏఐఏడీఎంకే వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పాలన గాడి తప్పకుండా చూసేందుకు, 54 ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణను ఆరుగురు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. వీరిలో జయలలిత నిచ్చెలి శశికళా నటరాజన్, ఆమెకు దీర్ఘకాల నమ్మినబంటు, చీఫ్ సెక్రటరీ షీలా బాలకృష్ణన్, అనుకోని పరిస్థితులు ఏర్పడితే, సీఎం పీఠం ఎక్కి, ఆపై అమ్మ రాగానే నమ్మకంగా పదవిని అప్పగించే సీనియర్ నేత పన్నీర్ సెల్వమ్ కీలకులని పార్టీ వర్గాలు వెల్లడించాయి.



