శాసనసభలో టిడిపి దూకుడు… ఊహించలేదే!

TDP AP Assembly Speaker Podiumశాసనసభ, మండలి సమావేశాల తొలిరోజునే టిడిపి సభ్యులు చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వైసీపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఈ సమావేశాలలో చంద్రబాబు నాయుడు అరెస్టుపై చర్చ మొదలుపెట్టి టిడిపి సభ్యులతో ఓ ఆటాడుకోవవచ్చని వైసీపి అనుకొంటే, టిడిపి సభ్యులే ముందుగా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలని కోరుతూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం దానిని నిరాకరించడంతో టిడిపి సభ్యులు పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేయడం మొదలుపెట్టారు. దీంతో స్పీకర్ సభను కొంతసేపు వాయిదా వేయక తప్పలేదు.

అంతకు ముందు మంత్రి అంబటి రాంబాబు సభలో మాట్లాడుతూ, “టిడిపి సభ్యులు మమ్మల్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. దీని వలన మా సభ్యులు రెచ్చిపోతే సభలో ‘అవాంఛనీయ ఘటనలు’ జరుగవచ్చు కనుక టిడిపి సభ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకరుగారికి మనవి చేస్తున్నాను.

ADVERTISEMENT

బాలకృష్ణగారూ… మీరు కావాలంటే సినిమాలలో మీసాలు తిప్పుకోండి ఇక్కడ కాదు… దమ్ముంటే రండి…” అంటూ సవాలు విసరడంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మంత్రి అంబటి రాంబాబు తీరుపై టిడిపి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగా నిసరసనలు తెలుపుతుంటే, అంబటి రాంబాబు ఉద్దేశ్యపూర్వకంగానే తమను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై కేసులు, అరెస్టు గురించి తాము సభలో చర్చించడానికి సిద్దంగానే ఉన్నామని చెపుతున్నా టిడిపి సభ్యులు అనవసరంగా ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు.

ఒకవేళ టిడిపి సభ్యులు శాసనసభ సమావేశాలను బహిష్కరించినా లేదా వచ్చి సభలో మెతక వైఖరి వహించినా వైసీపి సభ్యులు వారిని ఓ ఆటాడుకొని దారుణంగా అవమానించి ఉండేవారు. కానీ వారికి ఆవకాశం ఇవ్వకుండా టిడిపి సభ్యులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసిందనే విషయం ఈ సమావేశాల ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని టిడిపి సభ్యులు ప్రయత్నిస్తుండగా, చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి ముఖ్యనేతలందరూ ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని గట్టిగా నొక్కి చెప్పాలని వైసీపి ఆలోచన.

కనుక టిడిపి సభ్యులపై సస్పెన్షన్ వేటువేసి సభ నుంచి బయటకు పంపించేసి, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీలుపడుతూ సభలో లేని చంద్రబాబు నాయుడుపై అవహేళన చేస్తూ మాట్లాడుతూ, తమ అధినేత చిర్నవ్వులు చిందిస్తుంటే ఆయన భజన చేసి మెప్పు పొందేందుకు ప్రయత్నించడం తధ్యం.

కనుక టిడిపి సభ్యుల సస్పెన్షన్ తర్వాత శాసనసభలో ‘పరనింద-సొంత డప్పు’ తప్ప మరేమీ ఉండకపోవచ్చు. మహా అయితే కొన్ని బిల్లులను ప్రవేశపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకోవచ్చు. అంతే!

ADVERTISEMENT
Latest Stories