
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ మీద విరుచుకుపడ్డారు. లోకేష్ అవినీతి చంద్రబాబు గారికి తెలీదా లేక తెలిసే జరుగుతుందా అని విమర్శలు సంధించారు. తమిళనాడు లో అరెస్టు ఐన శేఖర రెడ్డికి లోకేష్ కి సంబంధాలు ఉండటం వల్లే ప్రధాని చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని అనుకుంటున్నారు, నాకైతే తెలీదు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ప్రమాదాన్ని చంద్రబాబు తక్కువ అంచనా వేసినట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన సాయం కోరినప్పటినుండి ఎన్నికల ప్రచార సభల్లో, తరువాత కూడా ఆయనకు మితిమీరిన గౌరవం ఇస్తూ వచ్చారు చంద్రబాబు. తెలుగు దేశం అభిమానులు చాలా మంది అడుగడుగునా చంద్రబాబును పవన్ కళ్యాణ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా హెచ్చరిస్తూ వచ్చారు.
అయితే పవన్ కళ్యాణ్ మీద నమ్మకమో ఏమో గానీ ఆ మాటలు పెడచెవిన పెట్టారు. అయితే వారు అనుకున్నట్టుగానే జరిగింది. పవన్ కళ్యాణ్ కు అతిమర్యాద ఇచ్చి ప్రజలలో ఆయన పరపతి పెంచి ఇప్పుడు ఆయన చేస్తున్న విమర్శలు తిప్పికొట్టడానికి తిప్పలు పడటం కేవలం స్వయం కృతాపరాధం అని ఆ పార్టీ అభిమానులే అంటున్నారు.



