చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన మినీ మహానాడు జిల్లా రాజకీయాలలో వేడి పుట్టిస్తోంది. ఈ సందర్భంగా టిడిపి నేత, జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశ్యించి, “మీరు చాలా శక్తివంతమైన రాజకీయ నేతనని అనుకొంటే సరిపోదు.. మీకు నిజంగా అంత కెపాసిటీ ఉంటే వచ్చే ఎన్నికలలో జగన్ ఫోటో పెట్టుకోకుండా మీ సొంత బలంతో గెలవగలరా?మీకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరేమీ తెలియదు. వచ్చే ఎన్నికలలో టిడిపి చేతిలో మీ ఓటమి తప్పదు,” అని అన్నారు.
కిషోర్ రెడ్డి సవాలుపై తంబళ్ళపల్లి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి గురువారం యర్రాతివారిపల్లెలో విలేఖరులతో మాట్లాడుతూ, “పెద్దిరెడ్డి కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేసినంత మాత్రన్న నువ్వు, చంద్రబాబు నాయుడు జిల్లాలో గెలుస్తారనుకొంటే భ్రమే. నువ్వు జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా తప్పకుండా ఓడిస్తాం. చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కుప్పం లేదా తంబళ్ళపల్లి నుంచి పోటీ చేస్తానంటే నేను రాజీనామా చేస్తాను. నాపై గెలిచి చూపించి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది,” అని ప్రతి సవాల్ విసిరారు.
చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలో సందర్భంగా మొన్న మదనపల్లిలో మినీ మహానాడు కోసం వచ్చినప్పుడు, వేలాదిమంది ప్రజలు తరలివచ్చి దారి పొడవునా ఆయనకు నీరాజనాలు పట్టారు. చంద్రబాబు నాయుడుని ఆయన సొంత జిల్లాలోనే రాజకీయంగా కోలుకోలేని విదంగా దెబ్బ తీయాలని వైసీపీ మూడేళ్ళుగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయినా చంద్రబాబు నాయుడుకి ఇంత అపూర్వ ప్రజాధారణ రావడం చూసి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు షాక్ అయ్యారు.
మినీ మహానాడుకు తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు ఉత్సాహాన్ని చూసి చంద్రబాబు నాయుడుతో సహా పార్టీ నేతలందరూ చాలా ఉత్సాహంగా జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను, అసమర్ధత, అవినీతిని ఎత్తిచూపి ఎండగట్టారు. టిడిపికి పెరిగిన జనాధారణ, ఆ పార్టీ నేతల సమరోత్సాహం చూస్తున్న జిల్లా వైసీపీ నేతలకు గుబులు మొదలైనట్లే ఉంది. అందుకే చంద్రబాబు నాయుడుని రాజీనామా చేసి పోటీ చేయాలని రెచ్చగొడుతున్నారు. అయితే ఇలాంటి ఉచ్చులో చిక్కుకొనేందుకు ఆయనేమీ కొత్తగా రాజకీయాలలోకి రాలేదు కదా?



