టీడీపి-జనసేన మద్య పొత్తులు మూన్నాళ్ళ ముచ్చటే అనుకోని గోతికాడ నక్కలా కాసుక్కూర్చున్నవారికి ఆ రెండు పార్టీలు ఎప్పటికప్పుడు తీవ్ర నిరాశే మిగులుస్తున్నాయి. కానీ వాటి పొత్తుతో తమ 175/175 పగటికలగా మిగిలిపోతుందనే జగన్ అంచనా మాత్రం తప్పలేదు.
నాడు సీట్ల సర్దుబాట్ల సమయంలోనే విడిపోతాయనుకుంటే నిరాశే మిగిలింది. వైసీపీ ఓటమి ఈవీఎంలకు అంకితమిచ్చేసి, కూటమిలో చిచ్చుకు చేయని ప్రయత్నం లేదు. ఫలించనందుకు చింతించని రోజూ లేదు.
కనీసం ముఖ్యమంత్రి పదవి విషయంలో చిచ్చు రగిలిద్దామనుకుంటే ‘చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరో పదేళ్ళు పనిచేస్తానంటూ’ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ తాడేపల్లినివాసులు జీర్ణించుకోవడం చాలా కష్టమే!
ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కు రావలన్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ని ప్రమోట్ చేయడం లేదు కానీ వైసీపీ మాత్రం నారా లోకేష్ని సిఎంగా ప్రమోట్ చేస్తూ, కాపు జ్వాల రగిలించేందుకు ప్రయత్నించింది. కానీ అదీ ఫలించలేదు.
వైసీపీలో తనను నంబర్ 2 స్థానంలోకి ప్రమోట్ చేసేందుకే జగన్ తనను ‘టైగర్ రాంబాబు’గా మార్చారనుకున్న అంబటి రాంబాబు ఈ పవర్ గేమ్లో పావుగా మారి సంతోషంగా జైలుకి కూడా వెళ్ళి వచ్చారు. కానీ ప్రమోషనూ రాలేదు! కనీసం ఆ సంతోషమూ, హైప్ కూడా మిగల్లేదు!
పాండవులు వనవాసం, అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు దానిని భగ్నం చేయడానికి దుర్యోధనుడు చేయని ప్రయత్నం లేదు. అలాగే జగన్ కూడా తమ మద్య చిచ్చు పెట్టేందుకు పట్టువదలని విక్రమార్కుడులా కృషి చేస్తూనే ఉన్నారని టీడీపి, జనసేనల ఏకాభిప్రాయం.
నేడు టీడీపి 44వ వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీని, అధినేత సిఎం చంద్రబాబు నాయుడుని అభినందిస్తూ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేశారు.
సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపి అనేక ఆటుపోట్లు తట్టుకొని ముందుకు సాగుతూ రాష్ట్రాభివృద్ధికి చాలా కృషి చేస్తున్నప్పుడు మనమూ అండగా నిలబడాలని ఆ లేఖ సారాంశం.
పవన్ కళ్యాణ్ వీరాభిమానులు, జనసేనలో కొందరు నేతలు, కార్యకర్తలు నేటికీ టీడీపితో పొత్తుని కూడా ఈ లేఖని జీర్ణించుకోవడం కష్టమే. టీడీపితో పొత్తుకి పవన్ కళ్యాణ్ అంగీకరించడం వల్లనే ఆ పార్టీ గెలిచిందని గుసగుసలాడుకుంటారు. కానీ 2019 ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏం జరిగిందో గుర్తుండదు. రాజకీయాలలో అందరినీ కలుపుకుపోగలిగినవారు, పార్టీలు మాత్రమే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలవు లేకుంటే సింగిల్, వృద్ధ సింహాల్లా ఇంటి గడప కూడా దాటలేరు.
కనుక పార్టీ అధినేతలుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ పొత్తు పెట్టుకొని విజయం సాధించారు తప్ప ఎవరూ ఎవరినీ గెలిపించలేదనే విషయం నేటికీ చాలా మంది అంగీకరించడం లేదు.
కనుక పార్టీ బురుజుల మీద ఫెవికాల్తో పటిష్టం చేసుకుంటే సరిపోదు. కింద పునాదులలో కూడా అంతే బలంగా ఉండటం చాలా అవసరం.
కనుక దిగువ స్థాయిలో నెలకొన్న అసంతృప్తి లేదా అసహనం, భేదాభిప్రాయలపై రెండు పార్టీల అధిష్టానాలు దృష్టి పెట్టాలి. లేకుంటే వైసీపీ దృష్టి పెడుతుంది.






