టిడిపి, జనసేనలు కలవకుండా ఉంచాలని ఎంతగానో ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి స్వయంగా వాటిని దగ్గరకు చేర్చి పుణ్యం కట్టుకొన్నారు. టిడిపితో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో బహుశః జగన్, ఐప్యాక్ కూడా షాక్ అయ్యుండవచ్చు. కానీ దేవుడి స్క్రిప్ట్ ప్రకారం అలా చేసేశామని చేతులు పిసుకొన్నాక, వాటిని మళ్ళీ ఎలా విడగొట్టాలని ఆలోచించి మరో కొత్త ఉపాయంతో మళ్ళీ వాటి మద్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
టిడిపితో పొత్తులు పెట్టుకొన్నామని ప్రకటించడానికి పవన్ కళ్యాణ్ ఎవరు?ఆ ముక్క చంద్రబాబు నాయుడు చెప్పాలి కానీ పవన్ కళ్యాణ్కి ఏమి అధికారం ఉంది?అంటూ ఆత్మసాక్షి ధర్మసందేహాలు వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ ఈ పొత్తు ప్రకటన చేయగానే టిడిపిలో టికెట్ ఆశిస్తున్నవారందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారట! పదవులకు రాజీనామాలు చేసేస్తున్నారట! జనసేనలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి ఏర్పడిందట!
చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఢీలా పడిపోయిన టిడిపి నేతలు, పార్టీలో ద్వితీయశ్రేణి నాయకులను, కార్యకర్తలను చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనలు తెలియజేయమని కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకొంటున్నారట. రెచ్చగొడుతున్నారట. ఇప్పుడు ధర్నాలు చేస్తే భవిష్యత్లో పెద్ద పెద్ద పదవులొస్తాయని నమ్మబలుకుతున్నారట! కానీ ఎవరూ ముందుకు రావడం లేదట! ఇలా సొంత కవిత్వం చాలానే వ్రాసింది.
అయితే పొత్తుల గురించి ప్రకటన చేయడానికి పవన్ కళ్యాణ్ ఎవరన్నప్పుడు, ఆయన జనసేన పార్టీకి అధ్యక్షుడనే విషయం మరిచిపోయినట్లుంది. ఆయన చంద్రబాబు నాయుడుని కలిసి వచ్చిన తర్వాత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలోనే ఈ ప్రకటన చేశారని, దానికి నారా లోకేష్, బాలకృష్ణ ఇద్దరూ ఆమోదం తెలిపారనే సంగతి కన్వీనియంట్గా మరిచిపోయింది.
టిడిపి, జనసేనలు కలిసే పోటీ చేస్తాయనే విషయం వాటికంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులే చెప్పేవారు. కనుక ఇదేమీ కొత్త విషయం కాదు. పవన్ కళ్యాణ్ చేసింది కేవలం అధికార ప్రకటన కావచ్చు. కానీ బహుశః చాలా నెలల క్రితమే టిడిపి, జనసేనలు ఏ స్థానాల నుంచి పోటీ చేయాలి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ మద్య అవగాహనకు వచ్చే ఉంటారు కదా?అయినా టికెట్స్ గురించి టిడిపి,జనసేనలు ఆలోచించుకోవాలి కానీ అది కూడా వైసీపియే ఆలోచించేస్తోందేమిటో?
అమరావతి కోసం రైతులే నాలుగేళ్లుగా ఆందోళనలు చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కోసం రెండు మూడు నెలలు టిడిపి ఆందోళనలు చేయలేని దుస్థితిలో ఉందంటే నమ్మశఖ్యంగా ఉందా?కనుక టిడిపి, జనసేనల పొత్తులను, ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలని కుట్రలు చేస్తున్న వైసీపి పట్ల రెండు పార్టీలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.




